ఎయిడ్స్ నివారణ కార్యక్రమంలో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలి
ఏఆర్టి సేవలను మరింత బలోపేతం చేయాలి
హెచ్ఐవీ బాధితులకు వైరల్ లోడ్ పరీక్షలు 99 శాతం పూర్తి చేయాలి
కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు ప్రతినిధి, మే 22, (సీమకిరణం న్యూస్) :


జిల్లాలో హెచ్ఐవి నిర్ధారణ, చికిత్స మరియు నియంత్రణ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వైద్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఎయిడ్స్ నివారణ, నియంత్రణ అంశం పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవి బాధితులు ఎవరూ చికిత్స మధ్యలో మానేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. హెచ్ఐవి చికిత్సను నిలిపివేసిన వారిని తిరిగి చికిత్సలోకి తీసుకురావడానికి ఇంటి సందర్శనలు, ఫోన్ ఫాలోఅప్స్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. స్టిగ్మా కారణంగా బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్న వారిని ప్రత్యేకంగా కలిసి అవగాహన కల్పించాలన్నారు. హెచ్ఐవి బాధితులకు నిరంతరాయంగా చికిత్స అందేలా చూడాలని, మందుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఏఆర్టి సిబ్బంది, గ్రామీణ స్థాయి ఆరోగ్య సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మొబైల్ వాహనాల ద్వారా కూడా అవసరమైన మందులను బాధితులకు చేరవేయాలన్నారు. హెచ్ఐవి నియంత్రణలో మొదట 95 లక్ష్యాల సాధనలో జిల్లా ఇప్పటికే మొదటి లక్ష్యాన్ని చేరుకుందన్నారు. వంద మందిలో 95 మందికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించి మొదటి స్థానం జిల్లా సాధించిందన్నారు. అయితే రెండో 95 లక్ష్యంలో ఇంకా పురోగతి అవసరమని, ముఖ్యంగా చికిత్స మధ్యలో నిలిపివేసిన బాధితులను తిరిగి చికిత్సలోకి తీసుకురావడం అత్యంత కీలకమన్నారు. ప్రస్తుతం చికిత్సను నిలిపివేసిన బాధితులను తిరిగి చేర్చేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఈ లక్ష్యాలను సాధిస్తే కర్నూలు జిల్లా రాష్ట్రంలో ఎయిడ్స్ నివారణ కార్యక్రమంలో అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు..హెచ్ఐవి పరీక్షలు, మందులు మరియు ఇతర వైద్య సేవల్లో ఎలాంటి కొరత లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. జిల్లాలో హెచ్ఐవీ చికిత్స పొందుతున్న ప్రతి బాధితుడికి వైరల్ లోడ్ రక్త పరీక్షలు నిర్వహించి, మందులు సక్రమంగా వినియోగిస్తున్నారో లేదో నిర్ధారించాలని కలెక్టర్ వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో వైరల్ లోడ్ పరీక్షల లక్ష్యం 99 శాతం కాగా, ఇప్పటికే 96.8 శాతం పురోగతి సాధించామని, మిగిలిన లక్ష్యాన్ని కూడా సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి నుంచి వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ సుకుమార్, డిఎంహెచ్ఓ డా.కామేశ్వర రావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు, డి ఆర్ డి ఏ పిడి రమణ రెడ్డి, జిల్లా లేప్రసీ అధికారి డా.భాస్కర్ రాజు, ఐసిడిఎస్ పిడి విజయ, డిసిహెచ్ఎస్ డా.జాఫ్రుల్లా, పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జవహర్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడి తులసి దేవి, ఎయిడ్స్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ అలీ హైదర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

