విద్యార్థుల భవిష్యత్తుకు న్యాయం చేయాలి : యువ నాయకుడు షేక్ నౌషద్
కర్నూలు ప్రతినిధి, జూలై 22,(సీమకిరణం న్యూస్) :
నీట్ పరీక్షకు సంబంధించిన వివాదాలు, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో విద్యార్థులపై బలప్రయోగం జరిగిందనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని నవ యువ నాయకుడు షేక్ నౌషద్ పేర్కొన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య హక్కు అని ఆయన అన్నారు. విద్యార్థుల సమస్యలను బలప్రయోగంతో అణచివేయకుండా, వారి ఆందోళనలకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. నీట్ పరీక్షకు సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలను ప్రజల ముందుంచి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశ యువత ఐక్యంగా ఉండి విద్యా వ్యవస్థలో పారదర్శకత, న్యాయం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా తమ గొంతు వినిపించాలని షేక్ నౌషద్ పిలుపునిచ్చారు.

