సమష్టి కృషితో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
భక్తుల రద్దీని తగ్గించేందుకు పలు చోట్ల నమూనా ఆలయాలు
అధికారులను ఆదేశించిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
విశాఖపట్నం, జూలై 27, (సీమకిరణం న్యూస్):
ఈ నెల 28, 29వ తేదీల్లో జరగనున్న సింహాచలం గిరి ప్రదక్షిణను ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై ఆమె సమీక్షించారు. 32 కిలోమీటర్ల మేర జరిగే గిరి ప్రదక్షిణ మార్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన ప్రతి చోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అవి పనిచేస్తున్నాయో లేదో పరిశీలించాలని, అన్ని కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి మార్గంలో ఏం జరుగుతుందో నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం కొండపై దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేసి తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. భక్తులకు అనువైన ప్రాంతాల్లో నమూనా ఆలయాలను ఏర్పాటు చేసి అక్కడ భద్రతా చర్యలు చేపట్టాలని, పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తొలి పావంచాతో పాటు నమూనా ఆలయాల వద్ద కూడా కొబ్బరికాయలు కొట్టి భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించుకునేలా చర్యలు తీసుకోవచ్చన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు, భద్రత, ట్రాఫిక్ తదితర అంశాల్లో తగిన చర్యలు తీసుకోవాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో ఎమ్మెల్యేలు గణబాబు, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, దేవస్థానం ఈవో వెంకటరావు, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్ తదితరులు పాల్గొన్నారు.

