బాలింతల భద్రతకు మరో ముందడుగు.. ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ కొత్త వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
త్వరలో సేవల్లోకి 500 ఆధునిక వాహనాలు.. ఏటా 2.75 లక్షల మంది బాలింతలకు లబ్ధి
అమరావతి, జూలై 20, (సీమకిరణం న్యూస్):
అమరావతిలో ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ నూతన వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మరింత సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు రూపొందించిన ఈ వాహనాల్లో కల్పించిన సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆధునిక వైద్య అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ వాహనాలను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సేవల్లోకి తీసుకురానున్నారు. తొలి దశలో 500 కొత్త ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు అందుబాటులోకి రానుండగా, వీటి ద్వారా ప్రతి ఏడాది సుమారు 2.75 లక్షల మంది బాలింతలు, నవజాత శిశువులు ప్రయోజనం పొందనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వం తల్లీ–శిశు ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అత్యవసర సమయాల్లో వేగవంతమైన, సురక్షిత రవాణా సేవలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు వెల్లడించారు.

