హంద్రీ నదికి నీటిని విడుదల చేయాలి
• 18 గ్రామాల తాగునీటి సమస్య పరిష్కరించాలి
• 68 చెరువుల ప్రాజెక్టుకు నీరు ఇవ్వాలి
• కలెక్టర్కు కేపియస్ అధినేత శ్రీహర్ష విజ్ఞప్తి
కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 20, సీమకిరణం న్యూస్):
కోడుమూరు, కల్లూరు మండలాల్లో హంద్రీ నది పరివాహక ప్రాంతంలోని 18 గ్రామాల్లో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) నుంచి లద్దగిరి సమీపంలోని స్లూయిస్ ద్వారా హంద్రీ నదికి నీటిని విడుదల చేయాలని కేపీఎస్ అధినేత ఎం.శ్రీహర్ష కోరారు. గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరికి ఎం.శ్రీహర్ష లేఖ రాశారు. ఎల్నినో ప్రభావంతో కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొని, ముఖ్యంగా కోడుమూరు, పాణ్యం నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని శ్రీహర్ష పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు ఈ ప్రాంతానికి జీవనాడిగా ఉందని, ఆగస్టు 12 నుంచి కాలువలో నీటి ప్రవాహం కొనసాగుతుండగా సుమారు 3,050 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని తెలిపారు. కర్నూలు జిల్లాకు హంద్రీనీవా ప్రవాహంలో దాదాపు 30 శాతం వాటా ఉన్నప్పటికీ, జిల్లాలోని స్లూయిస్లను మూసివేసి ఇతర జిల్లాలకు నీటిని తరలిస్తున్నారని, దీంతో కర్నూలు జిల్లా గ్రామాలకు తాగునీటి అవసరాలు తీరడం లేదని పేర్కొన్నారు. లద్దగిరి సమీపంలోని స్లూయిస్ను తెరిచి హంద్రీ నదిలోకి నీటిని విడుదల చేయాలని ప్రజలు, సంఘాలు, మేధావులు ఇప్పటికే అధికారులను కోరినట్లు తెలిపారు. తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు బోరు బావుల రీచార్జ్, భూగర్భ జలాల అభివృద్ధి కోసం లద్దగిరి స్లూయిస్ ద్వారా హంద్రీ నదికి కనీసం 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని శ్రీహర్ష కోరారు. అలాగే 68 చెరువుల ప్రాజెక్టుకు రోజుకు 110 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది అదనపు నీటి కోరిక కాదని, కర్నూలు జిల్లాకు రావాల్సిన న్యాయమైన వాటా అని పేర్కొన్నారు. తాగునీటి సమస్య కారణంగా కోడుమూరు, పాణ్యం ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి తాత్కాలికంగా కర్నూలుకు వలస వెళ్తున్న పరిస్థితి నెలకొందని శ్రీహర్ష తెలిపారు. సమస్యపై ప్రభుత్వానికి తక్షణమే నివేదించి, హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులను ఆదేశించి లద్దగిరి స్లూయిస్ ద్వారా హంద్రీ నదికి, 68 చెరువుల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని శ్రీహర్ష కోరారు.

