నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి: రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్
కర్నూలు ప్రతినిధి ఆగస్టు 23, (సీమకిరణం న్యూస్):

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కర్నూలు జిల్లా పోలీసులు రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడత కలిగిన వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో సంబంధిత పోలీసు అధికారులు రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇకపై సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ప్రశాంతమైన వాతావరణానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా తిరిగి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నేరాలకు దూరంగా ఉండి, కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని పోలీసులు సూచించారు.

