ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలు చిరస్మరణీయం
ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్
కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 23, (సీమకిరణం న్యూస్) :
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఆదివారం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రజాసేవకు అంకితమైన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజలకు విశిష్ట సేవలందించారని తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ప్రకాశం పంతులు పోషించిన పాత్ర చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు, ఏఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.