*పదేపదే చెప్పాలా..? పద్ధతి మార్చుకోరా..?*
• పారిశుద్ధ్య పర్యవేక్షక సిబ్బందిపై కమిషనర్ అసహనం
కల్లూరు, మే 08, (సీమకిరణం న్యూస్):

నగరంలో మెరుగైన పారిశుద్ధ్యమే ధ్యేయంగా జారీ చేసిన కీలక ఆదేశాల అమలులో ఎందుకింత నిర్లక్ష్యం..? పదేపదే చెప్పాలా..? తాను వచ్చి రెండు నెలలు అవుతున్నా ఇంకా పద్ధతి మార్చుకోరా..? అంటూ నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన వై. జంక్షన్లోని 16వ శానిటేషన్ డివిజన్లో మస్టర్ తనిఖీ నిర్వహించారు. బళ్ళారి చౌరస్తా, సీతరాంనగర్, ఆశోక్ నగర్, రోజ స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఉదయం 5:30 గంటలకల్లా విధుల్లో ఉండాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, సిబ్బంది మస్టర్ వద్దకే రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కార్ట్ వెంట తీసుకుని రహదారి ఇరువైపులా స్వచ్ఛత పనులు పూర్తి చేసిన అనంతరం, వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని ఆదేశించినప్పటికీ అమలు చేయకపోవడంపై పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు శాలిబాష, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.

