ఐక్యత కరవై..పాత్రికేయులకు న్యాయం దూరం..!!
యూనియన్ల జోరు..సమస్యల పరిష్కారంలో జీరో..!!
జర్నలిస్టుల మధ్య చీలికలు..రాజకీయ నేతలకు వరాలు..!!
ఎన్నికల్లో హామీలు..ఆ తర్వాత జర్నలిస్టులకు మొండిచేయి..!!
ఐక్య పోరాటమే పరిష్కారం అంటున్న సీనియర్లు..!!
ఇంటి స్థలాలు, ప్రెస్ క్లబ్ కోసం సమిష్టి పోరాటమే మార్గం..!!
నంద్యాల ప్రతినిధి , మే 07, (సీమకిరణం న్యూస్) :
నంద్యాల జిల్లాలో పాత్రికేయుల సమస్యలు సంవత్సరాలుగా పేరుకుపోతున్నా వాటి పరిష్కారంలో మాత్రం ఆశించిన పురోగతి కనిపించడం లేదు.ముఖ్యంగా జర్నలిస్టుల్లో ఐక్యత కొరవడటం,యూనియన్ల పేరుతో విభజనలు పెరగడం వల్ల ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఫలితంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి,అనంతరం పట్టించుకోకుండా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
*..అప్పట్లో ఐక్యత..ఇప్పుడు విభజనలు..!!*
2009కు ముందు నంద్యాల జిల్లాలో ప్రస్తుతం ఉన్నట్టుగా అనేక యూనియన్లు లేకపోయినా జర్నలిస్టుల్లో బలమైన ఐక్యత ఉండేదని సీనియర్ పాత్రికేయులు గుర్తు చేస్తున్నారు.ఏ సమస్య వచ్చినా అందరూ కలిసికట్టుగా పోరాడేవారని చెబుతున్నారు.అదే ఐక్యత ఫలితంగానే అప్పటి హౌసింగ్ మంత్రి శిల్పా మోహన్రెడ్డి,ఓ మహానుభావుడు,ప్రైవేట్ స్కూల్ యజమాని కేశవరెడ్డి సహకారంతో సుమారు 32 మంది పాత్రికేయులకు చాబోలు రోడ్డులో మూడు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు కేటాయించారని గుర్తుచేస్తున్నారు…ఆ స్థలాల్లో కొందరు ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటుండగా,మరికొందరు కుటుంబ అవసరాల కోసం విక్రయించుకున్నారని చెబుతున్నారు.ప్రస్తుతం భూముల ధరలు అమాంతం పెరగడంతో సెంటు స్థలం కొనుగోలు చేయడమే సామాన్య జర్నలిస్టుకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తమవుతోంది.
*..యూనియన్లు ఎక్కువ..ఫలితం సున్నా..!!*
ప్రస్తుతం నంద్యాల జిల్లాలో పదికి పైగా జర్నలిస్టు యూనియన్లు ఉన్నప్పటికీ,పాత్రికేయుల ప్రధాన సమస్యల పరిష్కారంలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.యూనియన్ల మధ్య ఆధిపత్య పోరు,వ్యక్తిగత విభేదాలు పెరగడంతో సమిష్టి పోరాట స్ఫూర్తి దెబ్బతిందని అంటున్నారు.
“ఎవరికివారే యమునా తీరం” అన్నట్టుగా పరిస్థితి మారిందని,పాత్రికేయుల సంక్షేమం అనే అసలు అజెండా పక్కన పడిందని ఆవేదన వ్యక్తమవుతోంది.
*..హామీలకే పరిమితమైన ప్రభుత్వాలు..!!*
ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు,ప్రెస్ క్లబ్ భవనాలు,సంక్షేమ పథకాలపై హామీలు ఇవ్వడం ఆనవాయితీగా మారిందని,అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ విషయాలను పూర్తిగా మరిచిపోతున్నారని జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు…2014–19 మధ్య అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం,2019–24 వరకు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా పాత్రికేయుల సమస్యల పరిష్కారంలో ఆశించిన చర్యలు తీసుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
*..ఐక్యంగా కదిలితేనే ఫలితం..!!*
ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ప్రెస్ క్లబ్కు శాశ్వత స్థలం లేకపోవడం,కొత్తగా ఇంటి స్థలాల కేటాయింపులపై ఎలాంటి స్పష్టత లేకపోవడం జర్నలిస్టుల్లో అసంతృప్తికి కారణమవుతోంది.ఈ నేపథ్యంలో యూనియన్లకు అతీతంగా అందరూ ఒక్క వేదికపైకి రావాల్సిన అవసరం ఉందని సీనియర్ పాత్రికేయులు సూచిస్తున్నారు…ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న ఎన్.ఎం.డీ ఫరూక్,ఎంపీ బైరెడ్డి శబరి సహకారంతో సమస్యల పరిష్కారానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. జర్నలిస్టులందరూ ఐక్యంగా ముందుకొస్తే ప్రెస్ క్లబ్ స్థలం,ఇంటి స్థలాల అంశాల్లో ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడుతున్నారు…“సమిష్టి పోరాటమే జర్నలిస్టుల బలం..ఐక్యతే సమస్యల పరిష్కారానికి మార్గం” అని జిల్లాలోని కొందరు సీనియర్ పాత్రికేయులు పేర్కొంటున్నారు.

