అద్దె చెల్లించని 45 మున్సిపల్ షాపులు సీజ్
రూ.90 లక్షల బకాయిలు –
కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు ప్రతినిధి, జూన్ 10, (సీమకిరణం న్యూస్):

నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్లలో షాపులను లీజుకు తీసుకుని నెలల తరబడి అద్దెలు చెల్లించకుండా ఉన్న లీజుదారులపై నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. బకాయిలు చెల్లించని 45 షాపులను సీజ్ చేసినట్లు కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీజ్ చేసిన 45 షాపుల లీజుదారుల వద్ద సుమారు రూ.90 లక్షల మేర అద్దె బకాయిలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. బకాయిల వసూళ్ల కోసం గత వారం రోజులుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించగా, ఆర్వోలు జునైద్, స్వర్ణలత, వాజిద్ల ఆధ్వర్యంలో సుమారు రూ.50 లక్షల వరకు బకాయిలు వసూలు చేసినట్లు తెలిపారు. మిగిలిన బకాయిదారులు కూడా వెంటనే తమ అద్దె బకాయిలను చెల్లించి నగరపాలక సంస్థకు సహకరించాలని కమిషనర్ చల్లా ఓబులేసు కోరారు. బకాయిలు చెల్లించని వారిపై తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

