భారతదేశం
ఓయి-లింగారెడ్డి గజ్జల
భారత అడవుల నుంచి ఏడు దశాబ్దాల క్రితం కనుమరుగైపోయిన ‘వేగం’.. ఇప్పుడు మళ్లీ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ఒకప్పుడు మౌనంగా ఉండిపోయిన కునో నేషనల్ పార్క్ లోయలు, ఇప్పుడు పసి కూనల గర్జనలతో ప్రతిధ్వనిస్తున్నాయి.
దశాబ్దాల విరామం తర్వాత, భారత గడ్డపై పుట్టిన చిరుతల సంఖ్య పెరుగుతుంటే, అది కేవలం వన్యప్రాణి సంరక్షణ మాత్రమే కాదు.. ప్రకృతిపై భారత్ సాధించిన అద్భుత విజయం! బుధవారం దక్షిణాఫ్రికా వీరవనిత ‘గామిని’ ముగ్గురు పసి కూనలకు జన్మనివ్వడంతో, భారతదేశపు చీత సైన్యం 38కి చేరుకుని కొత్త రికార్డును సృష్టించింది.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జంతువు చీత.. మన దేశంలో 1952లో అంతరించిపోయిందని ప్రకటించినప్పుడు, భారత ప్రకృతి వైవిధ్యంలో ఒక పెద్ద వెలితి ఏర్పడింది. కానీ, 2022లో ‘ప్రాజెక్ట్ చీతా’ రూపంలో ఆ వెలితిని పూడ్చేందుకు భారత్ నడుం బిగించింది. ఆ నమ్మకానికి నిదర్శనంగా నేడు కునో గడ్డపై 27 కూనలు మన మట్టిలోనే పుట్టి పెరగడం దేశానికే గర్వకారణం.
చిరుత గామిని ప్రసవం..
దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ‘గామిని’ రెండోసారి తల్లిగా మారి, మూడు నూతన వారసులను ఈ ప్రపంచానికి పరిచయం చేయడం.. ఈ ప్రాజెక్ట్ ఎంతటి పటిష్టమైన పునాదులపై ఉందో చాటి చెబుతోంది.
కునోలో ‘మినీ’ చిరుతల సందడి!
కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ అద్భుత ఘట్టాన్ని “గర్జిస్తున్న విజయం” (రోరింగ్ సక్సెస్) గా అభివర్ణించారు. కేవలం మూడు ఏళ్ల కాలంలో 9 సార్లు చిరుతలు విజయవంతంగా సంతానోత్పత్తి చేయడం అంటే మన పశువైద్యులు, ఫీల్డ్ స్టాఫ్ యొక్క నిరంతర శ్రమకు దక్కిన ఫలితం. ఈ నెలారంభంలోనే ‘ఆశ’ అనే చీత ఐదుగురు చిన్నారులను తీసుకురాగా, ఇప్పుడు ‘గామిని’ సంఖ్య మరింత పెరిగింది.
కునో🐆🌿 నుండి మరో శుభవార్త
కునో మూడు కొత్త పిల్లలను స్వాగతించింది – దక్షిణాఫ్రికా నుండి చిరుతలు వచ్చి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కునోలో గర్జించే కొత్త అధ్యాయం.
వేడుకలు కునో నేషనల్ పార్క్ ద్వారా గామిని, దక్షిణాఫ్రికా చిరుత మరియు రెండవసారి ప్రతిధ్వనించాయి… pic.twitter.com/JpqnfXlpYl
— భూపేందర్ యాదవ్ (@byadavbjp) ఫిబ్రవరి 18, 2026
వేగానికి సరికొత్త చిరునామా.. భారత్!
ఈ పసి కూనలు కేవలం జంతువులు మాత్రమే కాదు, భారతదేశం తన పర్యావరణం వారసత్వాన్ని ఎంతలా ప్రేమిస్తుందో చెప్పడానికి సజీవ సాక్ష్యాలు. “గామిని మరియు ఆమె మూడు చిన్న రన్నర్లు వేగంతో, గ్రేస్తో మన దేశపు చీత పునరుజ్జీవన కథను ప్రపంచ స్థాయికి తీసుకువెళతాయని ఆశిస్తున్నాను” అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉద్వేగంగా ప్రకటించారు. అవును.. భారత్ గడ్డపై వేగం మళ్ళీ పరుగు మొదలుపెట్టింది!

