తెలంగాణ
ఓయి-లింగారెడ్డి గజ్జల
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే ఒక విద్యార్థిని జీవితాన్ని చీకట్లోకి నెట్టేశాడు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా పోచారం డివిజన్లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.
పోచారం డివిజన్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని, అదే స్కూల్లో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పర్రే మైటీన్ (27) మాయమాటలతో ప్రేమలో పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తరగతి గదిలో మొదలైన పరిచయం, నెమ్మదిగా నమ్మకంగా మారి, చివరకు చట్టాన్ని లెక్కచేయని స్థాయికి చేరింది.

పిల్లలపై బాధ్యత కలిగిన ఉపాధ్యాయుడిగా ఉండాల్సిన వ్యక్తి, విద్యార్థిని తన మాటలతో మోసం చేసి, కుటుంబానికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బయటకు రావడానికి దాదాపు 20 రోజులు పట్టింది.
ఇటీవల విద్యార్థిని మెడలో పసుపు తాడు కనిపించడంతో తల్లి షాక్ కు గురైంది. తన దైన స్టైల్లో పదే పదే ప్రశ్నించగా, చివరకు జరిగిన మొత్తం బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు గుండె బరువెక్కింది.
తక్షణమే పాఠశాల నిర్వాహకులను ప్రశ్నించిన బాలిక కుటుంబ సభ్యులకు, అక్కడి నుంచి నిర్లక్ష్యమైన సమాధానాలు రావడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. విషయం తీవ్రతను గ్రహించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. బాలిక మైనర్ కావడంతో, ఉపాధ్యాయుడు పర్రే మైటీన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటన మరోసారి చేదు ప్రశ్నను లేవనెత్తుతోంది. పిల్లలు సురక్షితంగా ఉండాల్సిన స్కూల్ గోడల మధ్య ఇలాంటి నేరాలు ఎలా జరుగుతున్నాయి? తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు, వ్యవస్థలు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఈ ఘటన తీవ్రంగా గుర్తుచేస్తుంది.

