కర్నూలులో ఘనంగా ప్రజాశక్తి 46వ వార్షికోత్సవ వేడుకలు
కర్నూలు ప్రతినిధి , ఆగస్టు 03, (సీమకిరణం న్యూస్) :
ప్రజాశక్తి తెలుగు దినపత్రిక 46వ వార్షికోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాశక్తి ప్రధాన సంపాదకులు తులసీదాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జిల్లా ఇన్ఛార్జ్ నరసింహ ఉరువకిలి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కర్నూలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయవాది, నేషనల్ లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షుడు వై. జయరాజు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వై. జయరాజు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పత్రికల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రజల గొంతుకగా నిలుస్తూ సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజాశక్తి దినపత్రిక అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. 46 ఏళ్లుగా ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో ప్రజాశక్తి తనదైన ప్రత్యేకతను చాటుకుందని అన్నారు. ప్రజాశక్తి దినపత్రిక మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, భవిష్యత్తులోనూ ప్రజల పక్షాన తన కలాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ప్రజాశక్తి దినపత్రిక 46 ఏళ్లుగా ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తూ జర్నలిజం రంగంలో తనదైన ముద్ర వేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్తలు కె.వి. సుబ్బారెడ్డి, బి. పుల్లయ్యతో పాటు పలువురు ప్రముఖులు, పత్రికా ప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొని ప్రజాశక్తి వార్షికోత్సవానికి శుభాకాంక్షలు తెలిపారు.

