SIR ప్రత్యేక శిబిరాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలి
డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
కర్నూలు ప్రతినిధి, జూలై 06 (సీమకిరణం న్యూస్):

జిల్లాలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రత్యేక శిబిరాలను కర్నూలు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓర్వకల్లు మండలం నన్నూరు, కల్లూరు మండలం నాగేంద్రనగర్ సచివాలయం-94, వీకర్ సెక్షన్స్ కాలనీ సచివాలయం-97లో ఏర్పాటు చేసిన శిబిరాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, SIR ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, నిర్ణీత గడువులో పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు సమర్పించే దరఖాస్తులు, ధ్రువపత్రాలను నిబంధనల మేరకు పరిశీలించి వెంటనే సంబంధిత పోర్టల్లో డిజిటైజ్ చేసి ఆన్లైన్ నమోదు ప్రక్రియను జాప్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. గ్రామాలు, వార్డులు, కాలనీల్లో విస్తృత ప్రచారం నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ, బీఎల్వోలు మరియు ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఫిర్యాదులకు తావులేకుండా SIR ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి బీఎల్వోకు సహాయకులుగా ఐసీడీఎస్, మేప్మా, డ్వామా, డీఆర్డీఏ శాఖల నుంచి సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొంటూ, వారి సేవలను సమర్థవంతంగా వినియోగించి డిజిటైజేషన్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ తనిఖీలలో ఓర్వకల్లు తహసీల్దార్, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు తదితర అధికారులు పాల్గొన్నారు.

