మా కష్టం మాకు తెలుసు.. మా మెరిట్ మాకు తెలుసు.
మా ఉద్యోగాలపై రాజకీయాలు చేయొద్దు
విజయవాడ, ఆగస్టు 16, (సీమకిరణం న్యూస్):

మెగా డీఎస్సీ-2025లో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు వైసీపీ దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి సుమారు 7 వేల మంది టీచర్లు విజయవాడకు తరలివచ్చి భారీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు సాగిన ఈ ర్యాలీలో “నిందలు మానుకో.. నిజాలు తెలుసుకో”, “ఇది మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ కాదు” అంటూ ఉపాధ్యాయులు నినదించారు. సంవత్సరాల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండి, రేయింబవళ్లు చదివి, ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించామని వారు తెలిపారు. ఉద్యోగం వచ్చిన ఆనందంలో ఉండాల్సిన సమయంలో రాజకీయ ఆరోపణలతో తమ కుటుంబాల్లోనూ ప్రశాంతత లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “మా కష్టం మాకు తెలుసు.. మా మెరిట్ మాకు తెలుసు. మా ఉద్యోగాలపై రాజకీయాలు చేయొద్దు” అంటూ టీచర్లు స్పష్టం చేశారు.

