రైతులకు పారదర్శక సేవలు అందించడమే లక్ష్యం
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకం పంపిణీ చేసిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కర్నూలు ప్రతినిధి, మే, 06, (సీమకిరణం న్యూస్):
రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ హక్కులను మరింత భద్రపరచడం, భూములకు సంబంధించి పారదర్శక రికార్డులను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. బుధవారం సి. బెలగల్ మండలం, కొత్తకోట గ్రామం, స్వర్ణ గ్రామ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను జాయింట్ కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ… రైతులకు భూమిపై పూర్తి హక్కు, భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. రాజముద్రతో జారీ చేస్తున్న కొత్త పాసుపుస్తకాలు ప్రభుత్వ ధృవీకరణకు ప్రతీకగా నిలుస్తాయని, భూ రికార్డుల విషయంలో రైతులకు మరింత నమ్మకం కలిగిస్తాయని పేర్కొన్నారు. భూముల వివరాలు స్పష్టంగా, పారదర్శకంగా నమోదు కావడం ద్వారా భవిష్యత్తులో వివాదాలు తగ్గే అవకాశముందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

