భారతదేశం
ఓయ్-చంద్రశేఖర్ రావు
పాకిస్తాన్ ఘాతుకానికి తెగబడింది. పొరుగుదేశం ఆఫ్ఘానిస్తాన్ పై వైమానిక దాడులకు దిగింది. ఆ దేశ భూభాగంపై మెరుపుదాదులు చేసింది. సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలు 28 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలు. ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులు జరిగాయి. ఈ వైమానిక దాడులను అటు పాకిస్తాన్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ ధృవీకరించింది. సరిహద్దుల వెంబడి ఏడుచోట్ల వైమానిక దాడులు చోటు చేసుకున్నట్లు నిర్ధారించారు.
కొద్దిరోజుల కింద పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఓ మసీదుపై ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనికి ఆఫ్ఘనిస్తాన్, భారత్ ప్రధాన కారణమంటూ ఆరోపిస్తూ వస్తోంది పాకిస్తాన్. భారత్ ఈ దాడులకు ప్రణాళికలు రచించిందని, దీన్ని ఆఫ్ఘనిస్తాన్ అమలు చేసిందనీ చెబుతోంది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ పై తాజాగా ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది పాకిస్తాన్. ఈ దాడులు పక్తికా ప్రావిన్స్తో పాటు సరిహద్దు వెంబడి ఉన్న ఖోస్ట్, పక్తియా, నంగర్హర్ వంటి ఇతర ప్రావిన్స్లలో టీటీపీ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి.

పాకిస్తాన్ జరిపిన ఈ వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. పవిత్ర రంజాన్ మాసంలో జరిగిన ఈ దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్గాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్య్రాలకు భారత్ మద్దతు ప్రకటించింది. ఇది పాకిస్తాన్ తన అంతర్గత వైఫల్యాలను బయటి ప్రపంచానికి చూపించే ప్రయత్నమని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రంజాన్ మాసంలో ఆఫ్గాన్ భూభాగంలో పాకిస్థాన్ వైమానిక దాడులు జరగడం, అందులో మహిళలు, పిల్లలతో సహా పౌరులు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఇటువంటి ఎంతమాత్రం సమర్థనీయం కాదని సూచించింది. అంతర్జాతీయ సమాజం దీన్ని ఖండించాలని కోరింది. వైమానిక దాడుల్లో అమాయకులు మరణించడం ఆందోళనకరమని, పాకిస్తాన్ చర్యలు ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమిస్తోందని అన్నారు.
అటు ఆఫ్ఘనిస్తాన్ ఈ దాడుల పట్ల భగ్గుమంటోంది. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకతప్పదని హెచ్చరించింది. పక్తికా, నంగర్హార్ ప్రావిన్సుల్లో జరిగిన దాడులకు అవసరమైన, తగిన ప్రతీకారం శాఖ ఉందని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ హెచ్చరించింది. దేశ సరిహద్దులను, పౌరులను రక్షించడం తమ జాతీయ కర్తవ్యంగా అభివర్ణించింది. సరిహద్దు ఉల్లంఘనలు కొనసాగితే మౌనంగా ఉండదని తేల్చి చెప్పింది.
ఈ పాకిస్తాన్ దాడులు గూఢచార వైఫల్యాలకు నిదర్శనమని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది. తమ దేశ గడ్డ నుండి పనిచేస్తున్న పాకిస్తాన్ వ్యతిరేక మిలిటెంట్ గ్రూపులపై కాబూల్ చర్యలు తీసుకోవడం లేదని ఇస్లామాబాద్ ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరగడానికి ప్రాధాన్యత సంతరించుకుంది. పాకిస్తాన్, ఆఫ్ఘన్ తాలిబాన్ అధికారుల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి.

