ఇళ్ల మధ్య పారిశుధ్య సమస్యకు పరిష్కారం – అధికారుల ప్రత్యేక చర్య
దాసరాదొడ్డిలో చెత్త తొలగింపు.. పరిశుభ్రతపై గ్రామస్థులకు అవగాహన
వెల్దుర్తి, జూలై 31 (సీమకిరణం న్యూస్):

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లక్ష్మీనగరం గ్రామపంచాయతీ పరిధిలోని దాసరాదొడ్డి గ్రామంలో సుంకులమ్మ గుడి సమీపంలోని ఇళ్ల మధ్య నెలకొన్న పారిశుధ్య సమస్యను అధికారులు పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ పరిశుభ్ర–హరిత రాయబారులతో కలిసి పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు, ఈగలు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పారిశుధ్యంపై ప్రజలు అప్రమత్తంగా ఉండడం ద్వారా సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల బారిన పడకుండా నివారించవచ్చని అధికారులు తెలిపారు. గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, ఎంపీడీఓ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ రవి కిషోర్, సర్వేయర్–వీఆర్వో కృష్ణమూర్తి, ఏఎస్ఐ బాలకృష్ణ, పోలీసు సిబ్బంది, పరిశుభ్ర–హరిత రాయబారులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

