ఐటీ కంపెనీలకు భూములు, భవనాలు అద్దెకివ్వండి
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
3 సెంట్లు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూములు, భవనాల యజమానులు అర్హులు
కర్నూలు ప్రతినిధి, జూలై 30, (సీమకిరణం న్యూస్):
నగర పరిధిలో 3 సెంట్లు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన భూములు, భవనాలను ఐటీ కంపెనీలకు లీజుకు లేదా విక్రయించేందుకు ఆసక్తి ఉన్న యజమానులు ముందుకు రావాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఖాళీ స్థలాలు, నిర్మాణంలో ఉన్న భవనాలు, పూర్తిగా నిర్మించిన భవనాలను ఐటీ కంపెనీల అవసరాలకు అనుగుణంగా లీజుకు లేదా విక్రయించేందుకు ఆసక్తి ఉన్న వారు కలెక్టరేట్ కార్యాలయంలోని డీఆర్వో ఛాంబర్లో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు జిల్లా ఐటీ మేనేజర్ ఎస్. లీలావతి సెల్ నంబర్ 7042930572ను సంప్రదించాలని కమిషనర్ తెలిపారు. ఆసక్తి ఉన్న భూములు, భవనాల యజమానులు సంప్రదించే సమయంలో స్థలం లేదా భవనం ఫొటోలు, యజమాని పేరు, సంప్రదింపు ఫోన్ నంబర్, ఈ-మెయిల్ వివరాలు, భూమి లేదా భవనం విస్తీర్ణం, లీజుకు లేదా విక్రయానికి సంబంధించిన వివరాలు, ఆశిస్తున్న లీజు లేదా విక్రయ ధర తదితర సమాచారాన్ని అందించాలని సూచించారు. నగరంలో ఐటీ రంగ అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవసరమైన భూములు, భవనాల లభ్యతను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఈ వివరాలను సేకరిస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. అర్హత కలిగిన భూములు, భవనాల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వివరాలను అందించాలని కోరారు.

