రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో తొలిసారిగా GATT శస్త్రచికిత్స
గ్లాకోమా వల్ల చూపు కోల్పోయే ప్రమాదం నుంచి మహిళకు ఉపశమనం
కర్నూలు రీజినల్ ఐ హాస్పిటల్లో ఉచితంగా అత్యాధునిక చికిత్స
గ్లాకోమా బాధిత మహిళకు అత్యాధునిక చికిత్స – ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా అందుబాటులోకి ‘GATT’ సర్జరీ
కర్నూలు వైద్యం, జూలై 20, (సీమకిరణం న్యూస్):

కర్నూలు రీజినల్ ఐ హాస్పిటల్లో అత్యాధునిక గోనియోస్కోపిక్ అసిస్టెడ్ ట్రాన్స్లూమినల్ ట్రాబెక్యులోటమీ (GATT) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కర్నూలుకు చెందిన 61 ఏళ్ల మహిళకు గ్లాకోమా కారణంగా కంటిలో ఒత్తిడి పెరిగి, కంటి నరం దెబ్బతిని చూపు కోల్పోయే ప్రమాదం ఉండటంతో ఈ శస్త్రచికిత్స చేపట్టారు. శస్త్రచికిత్స అనంతరం వారం రోజుల తర్వాత నిర్వహించిన పరీక్షల్లో రోగి పూర్తిగా కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, విభాగాధిపతి డాక్టర్ యుగంధర్ రెడ్డి, శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ మణికంఠను అభినందించారు. సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో తొలిసారిగా ఈ అత్యాధునిక GATT శస్త్రచికిత్సను కర్నూలు రీజినల్ ఐ హాస్పిటల్లో విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. గతంలో హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్లో సేవలందించిన డాక్టర్ మణికంఠ తన అనుభవంతో ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారని చెప్పారు. హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ అధునాతన చికిత్సను ప్రభుత్వ ఆస్పత్రిలో పూర్తిగా ఉచితంగా అందించడంతో రోగి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

