ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 83,112 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,054 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.49 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుండి 15 గంటల సమయం పట్టింది.
తిరుమలలో ఎప్పుడూ లేనివిధంగా క్యూలైన్లో భక్తులు గొడవ పడ్డారు. ఒకరినొకరు పరస్పరం ఘర్షణకు దిగారు. వారిమధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బెల్ట్ తీసి కొట్టుకునేంత స్థాయికి వెళ్లింది. వారిలో ఒకరు బెల్ట్ తీసి కొట్టడం ఈ వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. క్యూ బయటి నుండి శ్రీవారి సేవకురాలు ఒకరు వారిని వారించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం కనిపించలేదు.

ఈ భక్తుల కుటుంబ సభ్యులు సైతం గొడవ చేసుకున్నారు. తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో కృష్ణ తేజ అతిథి భవనం సమీపంలోని క్యూలైన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రతరమౌతోండడంతో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది, శ్రీవారి సేవకులు వారిని శాంతింపజేశారు. క్యూ లైన్ లో దర్శనం సజావుగా సాగేలా చేశారు.
భక్తులు గొడవ పడిన టీటీడీ ధృవీకరించింది. కృష్ణ తేజ అతిథి భవనం సమీపంలోని క్యూలైన్లో వేచి ఉన్న సమయంలో ఇద్దరు భక్తులు ఘర్షణకు దిగిన సంఘటన సోమవారం నాడు చోటుచేసుకుందని వివరించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు అప్రమత్తంగా ఉండటంతో ఘర్షణను నిలువరించారని.
భక్తులు ఈ విధంగా పరస్పర ఘర్షణకు దిగడం సమంజసం కాదని, ఓర్పుతో, సహనంతో వ్యవహరిస్తూ తోటి భక్తులతో స్నేహపూర్వకంగా ఉండాలని, అదేవిధంగా క్యూలైన్ నియమాలను తప్పనిసరిగా పాటించి స్వామివారిని దర్శించుకోవాలని భక్తులు కోరుతున్నారు.

