ఆఫీసర్లూ.. మీరూ ఫైన్ కట్టాల్సిందే..!
ప్రజావాణి అర్జీలపై కలెక్టర్ హైమావతి కఠిన నిర్ణయం – అధికారులకు హెచ్చరిక
సిద్ధిపేట, ఆగస్టు 04, (సీమకిరణం న్యూస్) :
ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే అర్జీలు నెలల తరబడి పెండింగ్లో ఉండడం, సమస్యల పరిష్కారంలో జాప్యం జరగడంపై సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి అర్జీని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రజావాణి అర్జీ 30 రోజులకు మించి పెండింగ్లో ఉంటే, ఒక్కో అర్జీకి సంబంధిత అధికారిపై రూ.1,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేసే అధికారులపై బాధ్యతను పెంచే చర్యగా ఈ నిర్ణయం నిలిచింది. సోమవారం జరిగే ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఎన్నో కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిష్కారం కాకపోవడంతో చివరి ఆశగా కలెక్టర్కు వినతిపత్రాలు అందజేస్తారు. అయితే ఆ అర్జీలు సంబంధిత శాఖలకు వెళ్లిన తర్వాత నెలల తరబడి పెండింగ్లో ఉండడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ నిర్ణయంపై మరో కోణంలోనూ చర్చ జరుగుతోంది. జరిమానా భయంతో కొంతమంది అధికారులు అసలు సమస్యను పూర్తిగా పరిష్కరించకుండానే ఆన్లైన్లో అర్జీలను “పరిష్కరించబడింది”గా నమోదు చేసే అవకాశం ఉందని, లేదా సాంకేతిక కారణాలతో తిరస్కరించే ప్రమాదం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా తమ అర్జీల స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించడం అవసరం. సమస్య నిజంగా పరిష్కారమైందా? లేక కేవలం రికార్డుల్లో మాత్రమే ముగించారా? అనే విషయాన్ని సంబంధిత కార్యాలయాల్లో లేదా ఆన్లైన్లో ధృవీకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల సమస్యలకు వేగంగా పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం అమలులో ఎంతవరకు ఫలితాలిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

