ఆత్మకూరు ఆర్డీవో బి. పావనికి విశిష్ట సేవా పురస్కారం
నెల్లూరు/ ఆత్మకూరు, ఆగస్టు 16, (సీమకిరణం న్యూస్) :
విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తూ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్న ఆత్మకూరు ఆర్డీవో బి. పావని విశిష్ట సేవా అవార్డును అందుకున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా ఆమె ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రజలు ఎటువంటి సమస్యతో ఆర్డీవో కార్యాలయాన్ని ఆశ్రయించినా, సమస్యను వెంటనే పరిష్కరించేందుకు బి. పావని ప్రత్యేక చొరవ చూపుతున్నారని స్థానికులు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకే ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఆత్మకూరు ప్రాంతంలో ఆమెకు అవార్డు లభించడంపై వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆర్డీవో బి. పావనికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

