విశాలాంధ్ర విలేకరి నాగరాజుపై దాడి చేసిన పత్తికొండ సీఐని సస్పెండ్ చేయాలి
సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి. కృష్ణ
వెల్దుర్తి, సెప్టెంబర్ 12, (సీమకిరణం న్యూస్):
విశాలాంధ్ర విలేకరి నాగరాజుపై దాడి చేసి, పోలీస్స్టేషన్కు వచ్చిన విలేకరితో దురుసుగా, రౌడీలా ప్రవర్తించిన పత్తికొండ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి. కృష్ణ డిమాండ్ చేశారు. విలేకరిపై దాడి జరగడమే కాకుండా, తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషన్కు వచ్చిన విలేకరితో సీఐ దురుసుగా ప్రవర్తించడం, బెదిరింపు ధోరణిలో మాట్లాడటం తీవ్రంగా ఖండించాల్సిన విషయం అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే విలేకరులపై దాడులను అడ్డుకోవాల్సిన పోలీసులే వారిపట్ల అనుచితంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. గతంలో విద్యార్థి సంఘ నాయకులపై అక్రమ కేసులు బనాయించారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు విశాలాంధ్ర విలేకరిపై దాడి ఘటన వెలుగులోకి రావడం ఆందోళనకరమన్నారు. అధికారాన్ని చూసుకుని విర్రవీగడం సరికాదని, అధికారం శాశ్వతం కాదని హెచ్చరించారు. పోలీసు అధికారులు ప్రజల కోసం పనిచేయాలి కానీ రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ ప్రజాస్వామ్య విలువలను, మీడియా స్వేచ్ఛను అణచివేయడం తగదన్నారు. విశాలాంధ్ర విలేకరిపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు పత్తికొండ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని లేనియెడల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సిపిఐ టి. కృష్ణ ప్రకటనలో డిమాండ్ చేశారు.

