తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
తెలంగాణ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మేరకు సామాజిక భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పలు కీలక బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. విద్వేషపూరిత ప్రసంగాలు.. నేరాల నిరోధక బిల్లుకు తెలంగాణ కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.
అలాగే ప్రస్తుతం 40 లక్షలమందికి పైగా గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల సంక్షేమం కోసం ‘తెలంగాణ ప్లాట్ ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్- 2026’ కు కేబినెట్ ఆమోదం లభించింది. దీని ప్రకారం వర్కర్ల కంట్రిబ్యూషన్ తో పాటు ఒక ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల వీరికి చట్టబద్ధమైన గుర్తింపుతో పాటు సోషల్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది.
దాంతోపాటు తెలంగాణ కేబినెట్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనం నుంచి 15 శాతం లేదా రూ.10 వేలను కట్ చేసి నేరుగా తల్లిదండ్రులకు అందజేసే విధంగా బిల్లును తీసుకొచ్చారు.

అలాగే ఇటీవలి కాలంలో న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయి తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఇక కుల గణనపై న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికను కూడా కేబినెట్ ఆమోదించింది. ఇక విద్యాసంస్థల్లో కుల వివక్షను నివారించేందుకు ‘రోహిత్ వేముల చట్టం’ విధివిధానాల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యామ్నాయ మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

