తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
ఫిబ్రవరి 15న తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి పండగను ఘనంగా నిర్వహించారు. వీధుల్లోని ఆలయాల నుంచి ప్రముఖ దేవాలయాల వరకు శివ నామస్మరణతో మోగిపోయాయి. ఊరూరా శివరాత్రి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అయితే సోషల్ మీడియా మోజులో పడి కొందరు యువత వికృత చేష్టలు చేస్తున్నారు. తాజాగా శంషాబాద్ లోని ధర్మగిరి దేవాలయంలో కొందరు యువకులు చేసిన పని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
మహా శివరాత్రి పర్వదినం వేళ శంషాబాద్లోని ధర్మగిరి దేవాలయంలో కొందరు ఆకతాయిలు వికృతమైన చేష్టలు ఇప్పుడు నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓ వైపు భక్తుల స్వామి వారికి పండ్లు, కొబ్బరి కాయలు, పూలు సమర్పిస్తున్నారు. మరోవైపు కొందరు యువకులు శివునికి ఏకంగా గంజాయిని ప్రసాదంగా పెట్టారు. బడంగ్ పేట్ కు చెందిన చరణ్, అతని ఫ్రెండ్స్ ఈ వికృతమైన చేష్టలకు పాల్పడ్డారు. గంజాయిని దేవుడి ముందు పెట్టి వీడియో తీశారు. ‘దేవుడికి అందరూ కొబ్బరికాయలు కొడతారు.. మేము మాత్రం గంజాయి అంటూ ప్రసాదం పెడుతున్నాం’ ఆ వీడియోలో పేర్కొన్నారు.
ఆ తర్వాత ఈ వీడియో ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ స్పందించారు.
దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా? ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా?
మహాశివరాత్రి భక్తికి నిదర్శనం.. ముక్తికి సోపానం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన, దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య. అది వికృతమైన ఉన్మాదం!
మేమేదో సాహసం చేశామని… pic.twitter.com/MWeFz2Id19
— VC సజ్జనార్, IPS (@SajjanarVC) ఫిబ్రవరి 17, 2026
“దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా? ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా? మహాశివరాత్రి భక్తికి నిదర్శనం.. ముక్తికి సోపానం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన, దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య. అది వికృతమైన విషయం! చట్టం ప్రయోగిస్తే.. జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది.

లైకుల కోసం – లోకాన్నే మరిచి.. వ్యూస్ కోసం – విలువలనే వదిలి..రీల్స్ కోసం – రోడ్డున పడి.. మత్తులో మునిగి – జీవితాలను నాశనం చేసుకుంటారా!? చెప్పండి. క్షణికానందం ఇచ్చే లైకులు, వ్యూస్ కోసం మీ బంగారు భవిష్యత్తును బలిపెట్టకండి. ఇటువంటి చర్యలను ఉపేక్షించం. బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాను మీ సృజనాత్మకతకు వేదికగా మార్చుకోండి.. వ్యసనాలకు వాకిలిగా కాదు” అని పోస్ట్ చేశారు.

