ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
పోలీసు శాఖ గౌరవాన్ని మరింత పెంచాలి
కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్
ఎస్ఐ స్థాయి నుండి సిఐలుగా పదోన్నతి
ఎస్ఐ నుండి సిఐలుగా పదోన్నతి పొందిన పోలీసు అధికారులను అభినందించిన కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్
కర్నూలు క్రైమ్, జూన్ 09, (సీమకిరణం న్యూస్):

కర్నూలు రేంజ్ పరిధిలో ఇటీవల సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) గా పదోన్నతి పొందిన పోలీసు అధికారులు మంగళ వారం కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన పోలీసు అధికారులను డీఐజీ అభినందించారు. పదోన్నతితో మరింత బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, చట్టబద్ధంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో మరింత చొరవ చూపాలని తెలిపారు. పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పనిచేయాలని సూచించారు. సీఐలుగా పదోన్నతి పొంది డీఐజీ గారిని కలిసిన వారిలో ఎ.పి. శ్రీనివాసులు, జీవన్ రెడ్డి , ముత్యాల శ్రీనివాసులు, ధనుంజయ,తిమ్మయ్య, లక్ష్మీనారాయణ, హనుమంతయ్య, లలిత ఉన్నారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారులు కర్నూలు రేంజ్ డీఐజీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

