మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
- జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి
- జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్ష..
మట్టి వినాయకులనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు
కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 13, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గణనాథుని దివ్య కృపతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో సుభిక్షంగా జీవించాలని ఆమె మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో జిల్లాలో తలపెట్టే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమం విజయవంతం కావాలని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను గుర్తుచేస్తూ.. ప్రకృతి సమతుల్యతను కాపాడాల్సిన నైతిక బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ , ప్రమాదకర రసాయన రంగులతో కూడిన విగ్రహాలకు బదులుగా, సంప్రదాయబద్ధమైన మట్టి ప్రతిమలను మాత్రమే పూజించాలని పిలుపునిచ్చారు. కాలుష్య రహితంగా, పర్యావరణ హిత పద్ధతుల్లో పండుగను భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని జిల్లా ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.

