భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
భారతదేశం ఎన్నో చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు చూపరులను ఆకట్టుకుంటాయి. అందుకే విదేశీయులు భారత్ లో ఉండటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇక్కడి ప్రాంతాలకు వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్న ఆ అద్భుతాలను తెలుసుకోవడానికి ఉవ్విళ్లూరుతుంటారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో అనేక చారిత్రక కట్టడాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, జలపాతాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇక మహారాష్ట్ర పర్యాటకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మహారాష్ట్రలో చారిత్రక కోటలు, కట్టడాలు, పురాతన గుహలు, ప్రకృతి రమణీయమైన హిల్ స్టేషన్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలతో అలరారుతోంది. మహారాష్ట్రలో అజంతా ఎల్లోరా గుహలు, ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా, మహాబలేశ్వర్ హిల్ స్టేషన్ అలాగే షిర్డీ సాయిబాబా ఆలయం అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక నానేఘాట్ గుహలు.. మహారాష్ట్రలోని పూణే జిల్లా, జున్నార్ సమీపంలోని పశ్చిమ కనుమలలో ఉన్నాయి. తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన శాతవాహన రాజుల కాలంలో (క్రీ. పూ. 2-1 శతాబ్దం) ఈ కొంకణ్ తీరం, జున్నార్ మధ్య ప్రధాన వాణిజ్య మార్గంగా ఉండేది. ఇక్కడ ఉన్న బ్రాహ్మీ లిపి శాసనాలు, రాణి నాగనిక వేయించిన అశ్వమేధ యాగం వివరాలు శాతవాహనుల హిందూ ఆచారాలను వివరిస్తున్నాయి.
అలాగే నానేఘాట్ కొండల్లో ట్రెక్కింగ్ కూడా మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. వీకెండ్, సెలవు రోజుల్లో యువతీ యువకులు ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తూ చారిత్రక ప్రదేశాలను చూస్తూ మైమరిపోతుంటారు. ఇక నానేఘాట్ కొండల్లో రివర్స్ వాటర్ ఫాల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సాధారణంగా జలపాతం అంటే నీళ్లు కొండల మీద నుంచి భూమికి చేరుతాయి. కానీ ఇక్కడ నీళ్లు తిరిగి పైకి వెళ్తాయి. అందుకే దీన్ని రివర్స్ జలపాతం అంటారు. రివర్స్ వాటర్ ఫాల్స్ కు కారణం ఏంటంటే..?
వర్షాకాలంలో బలమైన గాలుల కారణంగా నీరు కిందకి పడకుండా పైకి ప్రవహిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇదొక అద్భుతమైన అనుభూతి. ఈ రివర్స్ వాటర్ ఫాల్స్ అధికంగా మహారాష్ట్రలోని నానేఘాట్, లోనావాలా, సహ్యాద్రి కొండల్లో ఎక్కువగా కనిపిస్తాయి. బలమైన రుతుపవనాల గాలులు గురుత్వాకర్షణను అధిగమించి నీటిని పైకి నెట్టేస్తుంటాయి. అందువల్ల రివర్స్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇక్కడ నీరు 130 అడుగుల ఎత్తు నుండి కిందకి పడకుండా.. గాలి తాకిడికి వెనక్కి అంటే పైకి వస్తుంది.

ఇక నానేఘాట్ కొండలు.. హైదరాబాద్ నుంచి సుమారు 650 కి. మీ దూరంలో ఉన్నాయి. నేషనల్ హైవే 65 గుండా ప్రయాణిస్తే ఈ చేరుకోవచ్చు. దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఇక నానేఘాట్ కొండలకు అతి సమీపంలోని రైల్వే స్టేషన్ కల్యాణ్. హైదరాబాద్ నుంచి ముంబై చేరుకుని.. అక్కడి నుంచి రైలులో కల్యాణ్ చేరుకోవచ్చు. నానేఘాట్ కొండలకు దగ్గరలోనే హరిశ్చంద్రగఢ్ కోట, శివ్ నేరికోట, అజోబా హిల్ ఫోర్ట్ లు ఉన్నాయి. వాటిని కూడా సందర్శించవచ్చు.

