ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా నలుగురు మంత్రులకు ఇలా బెదిరింపు లేఖలు వచ్చినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల పేరుతో హెచ్చరికలతో ఈ లేఖలు వచ్చాయి. మొదట కందుల దుర్గేష్ కు లేఖ రాగా.. తుళ్లూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. అయితే, మరో ముగ్గురు మంత్రులకు ఇదే తరహా లేఖలు రావటం సంచలనంగా మారింది. ఈ లేఖల పైన ఆరా తీస్తున్నారు. ఎవరు రాసారు.. మావోయిస్టుల పేరుతో లేఖలు ఎందుకు వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు ఆధారాలు.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సహా మరో ముగ్గురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో లేఖ వచ్చింది. కందుల దుర్గేశ్కు వచ్చిన లేఖలో ఆయన కుటుంబ సభ్యులకు మావోయిస్టుల చేతిలో ప్రాణహాని తప్పదని బెదిరిస్తూ సచివాలయంలోని మంత్రి పేషీకి లేఖ అందజేసింది. ఈ బెదిరింపు లేఖపై మంత్రి వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు మంగళవారం రాత్రి తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లేఖ ఎవరు రాశారు అనే దానిపై తుళ్లూరు పోలీసులు విచారణ చేపట్టారు. ఏకంగా సచివాలయంలో ఉన్న మంత్రి పేషీకి ఈ లేఖ రావడం కలకలం సృష్టించింది. దుర్గేశ్ తో పాటుగా మరో ముగ్గురు మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ పేషీలకు ఇదే రకమైన లేఖలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ నాలుగుల్లో ఒకే రకమైన హెచ్చరిక… ఫోన్ నంబర్ లేఖ కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ లేఖల పైన విచారణ మొదలైంది.

పోలీసులకు ఫిర్యాదు.. విచారణ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ మంత్రులకు బెదిరింపు లేఖల అంశం కలకలం గా మారుతోంది. దీని పైన స్పందించిన కందుల దుర్గేశ్ ఇలాంటి లేఖలతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా రాసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేసారు. మావోయిస్టుల లేఖలు ఇలా ఉండవని చెబుతున్నారు. తాను పర్యవేక్షిస్తున్న టూరిజం శాఖ చిన్నదని.. మావోయిస్టులు రాసే అంత ఉండదని పేర్కొన్నారు. ఈ లేఖపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెదిరింపు లేఖపై దర్యాప్తు చేపట్టారు. ఈ లేఖ ఎవరు పంపించారు? ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తున్నారు. ఇది నిజంగానే మావోయిస్టులు పంపించారా? లేదంటే ఆకతాయిల పనా అన్న కోణంలోనూ విచారణ జరిగింది.

