Friday, July 24, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అర్హులైన ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం

అర్హులైన ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం

📰 Generate e-Paper Clip

ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ASD పరిశీలనలో నిర్లక్ష్యం వద్దు 

 

అర్హులైన ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం

 

జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

 

కల్లూరు అర్బన్‌లో ఎస్‌ఎస్‌ఆర్ శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ

 

కర్నూలు, జూలై 12 (సీమకిరణం న్యూస్):

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SSR) కార్యక్రమాన్ని వేగవంతంగా, అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని పాణ్యం నియోజకవర్గ ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం కల్లూరు అర్బన్ పరిధిలోని అబ్బాస్ నగర్, కృష్ణానగర్, న్యూ కృష్ణానగర్, షరీన్ నగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ శిబిరాలను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన, శిబిరాల నిర్వహణ, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ మరియు ఓటరు నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.

ఇంటింటికీ ఎన్యూమరేషన్ ఫారాలు:

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ.. ఏఈఆర్‌ఓలు (AEROs), బీఎల్‌ఓలు (BLOs) సమన్వయంతో వ్యవహరించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ప్రతి ఇంటికీ ఈ ఫారాలు అందేలా చూడాలని సూచించారు. కొత్త ఓటరు నమోదులతో పాటు పేరు, చిరునామా తదితర సవరణల దరఖాస్తులను సకాలంలో స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిశీలించి నిర్ణీత గడువులోపు డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

ASD ఓటర్లపై ప్రత్యేక నిఘా:

ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులకు తావుండకూడదని, ముఖ్యంగా ASD (Absent, Shifted, Duplicate) ఓటర్ల పరిశీలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జేసీ అధికారులకు సూచించారు. మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, అలాగే ఒకే పేరుతో రెండు చోట్ల నమోదైన డూప్లికేట్ వివరాలను క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో ధృవీకరించాలన్నారు. అర్హులైన వారికి అన్యాయం జరగకుండా, అనర్హుల పేర్లు జాబితాలో ఉండకుండా కచ్చితమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్షేత్రస్థాయి తనిఖీ కార్యక్రమంలో కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు మరియు సంబంధిత ఎన్నికల విభాగపు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular