సామాజిక సేవలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి
హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ అధ్యక్షులు హరి సింహనాయుడు
సత్య సాయి బాబా సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద చిన్నారులకు పాదరక్షలు పంపిణీ
వెల్దుర్తి, ఏప్రిల్ 09, (సీమకిరణ న్యూస్) :
నిరుపేద ప్రజలకు సేవ చేయడమే నా జీవిత లక్ష్యమని హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ అధ్యక్షులు హరి సింహ నాయుడు తెలిపారు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని నిరుపేద చిన్నారులు మండే ఎండల్లో చెప్పులు లేకుండా తిరుగుతు ఇబ్బంది పడడం గమనించిన శ్రీ సత్య సాయి బాబా సేవా సమితి కన్వీనర్ సురేష్ యాదవ్ హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ అధ్యక్షులు హరి సింహనాయుడు ఆద్వర్యంలో వారికి పాదరక్షలు ఇప్పించి చిన్నారులకు పంపిణీ చేయించారు. అదేవిధంగా నిరుపేదలకు వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా హరి సింహ నాయుడు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి బాబా సేవా సమితి కన్వీనర్ సురేష్ యాదవ్ అనేక సేవా కార్యక్రమాలు ప్రచారానికి దూరంగా చేస్తున్నారని, చిన్నారుల పాదాలు మండే ఎండకు బాధపడకుండా పాదరక్షలు ఏర్పాటు చేశారని, నిరుపేదలకు వస్త్రాలు అందించారని ఆయన కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమవంతు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిరుపేదలకు చేతనైన సహాయం అందించాలని కోరారు.

