ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల ప్రదర్శన. మంగళవారం నాడు 73,572 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,747 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.38 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 29 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది.
కాగా- టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల సమగ్ర అభివృద్ధికి 2026- 27 ఆర్థిక సంవత్సరంలో రూ.118.89 కోట్ల నిధులు కేటాయించింది. అత్యాధునిక సాంకేతికత, విద్యార్థుల సామర్థ్యాల పెంపు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఏడాది ఎస్వీ విద్యాదాన ట్రస్ట్, టీటీడీ కలిపి ఆయా కళాశాలలను మరింత ఆధునికీకరించి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మొత్తం రూ.118.89 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో టీటీడీ విద్యా సంస్థలలో అదనపు తరగతి గదులు, అదనపు వసతి గదుల నిర్మాణం, పాఠశాలలు, కళాశాలల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, టీచింగ్, నాన్-చింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే విద్యార్థుల కోసం ఐఐటీ, నీట్, సీఏ, క్లాట్ తరహా కోర్సులు, స్కిల్ డెవలప్మెంట్, జాబ్ ఓరియెంటెడ్, వృత్తి ఆధారిత కోర్సులు అందుబాటులోకి వస్తాయి. అత్యాధునిక సాంకేతిక బోధనకు పెద్దపీట వేస్తూ డిజిటల్ క్లాస్రూమ్స్, కంప్యూటర్లు, స్మార్ట్ ప్యానల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్లు, వర్చువల్ కాన్ఫరెన్స్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, మొబైల్ మెడికల్ యూనిట్ సేవలు అందించడం వంటి చర్యలు చేపట్టారు.
ప్రత్యేకంగా శ్రీ పద్మావతి జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు వైద్య సేవలు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

