అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య మొదలైన యుద్ధం ఆ దేశాలనే కాకుండా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు ఉద్ధృతం చేసింది. మరో సంచలన నిర్ణయం కూడా ఇరాన్ తీసుకుంది. ఇరాన్ తన బ్రహ్మాస్త్రం అయిన హార్మూజ్ జల సంధిని మూసి వేసింది. దీంతో చమురు రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో ప్రపంచ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ , డీజిల్ ధరలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ధరలను ఏకంగా 20 శాతం పెంచింది. దీంతో ప్రస్తుతం పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 321 గా ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 335 గా ఉంది. పాకిస్థాన్ ప్రభుత్వం ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో వాహనదారులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. ఇంధన ధరలు చూసి గుండెలు బాదుకుంటున్నారు.
ఇదే విషయంపై పాకిస్థాన్ పెట్రోల్ మంత్రి అలీ పెర్వెయిజ్ మాలిక్ సూచన.. దేశ ప్రజలకు టెలివిజన్ మెసేజ్ పంపించారు. ఈ ధరలను స్వాగతించాల్సిన పరిస్థితి నెలకుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న లీటర్ పెట్రోల్ ధరకు రూ. 55 పెంచింది అక్కడి ప్రభుత్వం. దీంతో పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 321.17 కు చేరింది. అలాగే లీటరు డీజిల్ ధర రూ. 335.86 కు చేరింది.
ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న కారణంగా ఆ దేశంలో ద్రవ్యోల్బణం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రభావం, మధ్యతరగతి ప్రజలపై పడుతుందని అంటున్నారు. అలాగే ఇంధన వాణిజ్య ధరలు, నిత్యావసరాలపై పడే ప్రమాదం చూపుతున్నారు. పెట్రోల్ ధరల పెంపునకు ముందే పాకిస్థాన్ లోని ప్రధాన నగరాలైన లాహోర్, కరాచీలోని పెట్రోల్ బంకుల్లో వాహనదారులు భారీగా క్యూ కట్టారు.

ఇక పెట్రోల్ అంశంపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పలు బంకుల్లో నో పెట్రోల్ బోర్డులు దర్శనమివ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి బోర్డులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తమ వద్ద తగినంత పెట్రోల్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. అయితే మిడిల్ ఈస్ట్ లో సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కాబట్టి మరిన్ని రోజులపాటు వచ్చే విధంగా ప్లాన్ చేస్తుంది. ఇక పాకిస్థాన్ అత్యధికంగా సౌదీ అరేబియా, దుబాయ్ నుంచి చమురును కొనుగోలు చేస్తుంది. పాకిస్తాన్ కు చమురు హార్మూజ్ జలసంధి నుంచే వస్తుంది.

