తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు స్థానిక నాయకత్వానికి లిట్మస్ టెస్ట్ లా మారాయి. ప్రతి మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో వారి పైన పోటీ చేసి ఓటమిపాలైన ఎమ్మెల్యేల మధ్య హోరాహోరీగా పోరు సాగింది. నువ్వా నేనా అన్నట్టు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
తొర్రూరులో నువ్వా నేనా?
ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ స్థానిక బలం ఎవరికి ఉంది అన్నది ఈ ఎన్నికల ఫలితాలు చెబుతున్నట్లుగా. గత ఎన్నికల అసెంబ్లీలో పాలకుర్తి నియోజకవర్గం చాలా కీలకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. పాలకుర్తి నియోజకవర్గం నుండి సీనియర్ నాయకుడు అయిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేయగా, ఆయన పైన యంగ్ పొలిటీషియన్, ఎన్నారై ఝాన్సీరెడ్డి కోడలు యశస్విని రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు.

తొర్రూరు మున్సిపాలిటీ కోసం కష్టపడిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
పాలకుర్తి నియోజకవర్గం లో ఎర్రబెల్లి దయాకర్ రావుని ఓడించి నియోజకవర్గ ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి సంచలనం సృష్టించారు. ఇక అప్పటినుండి మళ్లీ పాలకుర్తి నియోజకవర్గంలో సత్తా చాటాలని నిరీక్షిస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మున్సిపల్ ఎన్నికలకు కావలసిన ఉత్సాహాన్ని ఇచ్చాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన ఎర్రబెల్లి, ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ ని కూడా పిలిపించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
తొర్రూరు మున్సిపాలిటీపై ఎగిరిన గులాబీ జెండా
తొర్రూరు మున్సిపాలిటీపై విజయకేతనం ఎగురవేయడం లక్ష్యంగా ఎర్రబెల్లి చేసిన ప్రయత్నం ఫలించింది. ఫలితంగా తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన అధికారాన్ని ప్రదర్శించింది. మొత్తం 16 వార్డులకు గాను, 10 వార్డులను కైవసం చేసుకుని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ విజయంతో పార్టీలో నూతన ఉత్సాహం.
విజయంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డ్యాన్సులు
ఈ విజయాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యకర్తలతో డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. తొర్రూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అని భావించిన ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి ఊహించని విధంగా భారీ షాక్ తో కంగుతిన్నారు.

