తెలంగాణలో చారిత్రక కట్టడాల పరిరక్షణకు పెద్దపీట
పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానం విస్తరణకు కేంద్రం చర్యలు
లోక్సభలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నలకు వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రులు
న్యూ ఢిల్లీ , ఆగస్టు 03, (సీమకిరణం న్యూస్) :
దేశవ్యాప్తంగా చారిత్రక సంపద పరిరక్షణతో పాటు, విద్యారంగంలో ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు… ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్సభలో సోమవారం అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు వివరాలు వెల్లడించింది. పర్యాటక రంగం బలోపేతానికి చర్యలు, డిజిటల్ విద్యాబోధన తీరుతెన్నులపై వేర్వేరుగా అడిగిన ప్రశ్నలకు.. కేంద్ర విద్యా శాఖ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు.
చారిత్రక కట్టడాల పరిరక్షణకు నిధులు
దేశవ్యాప్తంగా పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ASI) పరిధిలో ఉన్న చారిత్రక కట్టడాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దేశంలో మొత్తం 3,688 కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు, ప్రదేశాలు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక కట్టడాల పరిరక్షణకు హైదరాబాద్ సర్కిల్ ద్వారా గడచిన ఐదేళ్లలో (2021-22 నుండి 2025-26 వరకు) కేటాయించిన నిధులు మరియు వ్యయానికి సంబంధించిన వివరాలను ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ (హైదరాబాద్ సర్కిల్) పరిధిలో గత ఐదేళ్ల బడ్జెట్ కేటాయింపులు ఇలా..
2021-22లో రూ. 7 కోట్లుగా ఉన్న కేటాయింపులు,2022-23 నాటికి రూ. 15.50 కోట్లకు పెరిగాయని,2025-26లో రూ. 14.93 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. ‘అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0’ కింద చారిత్రక ప్రదేశాల్లో వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పాఠశాలల్లో డిజిటల్ విద్యకు ప్రోత్సాహం
పాఠశాలల్లో డిజిటల్ విద్యను మరింత విస్తృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై లోక్సభలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి వివరాలు కోరారు.జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించడానికి బడ్జెట్ కేటాయించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు.
తెలంగాణ డిజిటల్ మౌలిక వసతులు
రాష్ట్రంలో మొత్తం ఎంపిక చేసిన పాఠశాలలు 41,762 ఉండగా.. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను అందించే దిశగా 2,104 స్మార్ట్ క్లాస్రూమ్లు ఏర్పాటయ్యాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 20,490 పాఠశాలల్లో కంప్యూటర్ సౌకర్యం అందుబాటులోకి రాగా, 15,535 పాఠశాలలకు ఇంటర్నెట్ సేవలు అనుసంధానించబడ్డాయని మంత్రి తెలిపారు.
ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ..
రాష్ట్రంలో డిజిటల్ బోధనపై శిక్షణ పొందిన ఉపాధ్యాయుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని తెలిపారు. 2020-21లో 2,980 మంది ఉపాధ్యాయులు ఈ శిక్షణను అందుకోగా, 2021-22 నాటికి ఈ సంఖ్య 75,735 మందికి చేరిందని, 2022-23లో 31,273 మంది, 2023-24లో 448 మంది, 2024-25లో 16,618 మంది, 2025-26లో 22,519 మంది ఉపాధ్యాయులు డిజిటల్ శిక్షణను పూర్తి చేసుకున్నట్లు ఆయన వివరించారు.

