ఆంధ్ర ప్రదేశ్
ఓయి-లింగారెడ్డి గజ్జల
అమరావతి రాజధానిలో అత్యాధునిక హంగులతో కొలువుదీరిన సీఆర్డీఏ (CRDA) ప్రధాన కార్యాలయ ఉద్యోగుల పాలిట ‘అందని ద్రాక్ష’లా మారింది. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన భవనంలోకి మారిన ఆనందం కంటే, అక్కడికి చేరుకోవడానికి పడుతున్న ప్రయాణ కష్టాలే సిబ్బందిని కుంగదీస్తున్నాయి. 11 ప్రభుత్వ శాఖలు ఒకే గొడుగు కిందకు రావడంతో అమరావతి కళకళలాడుతున్నప్పటికీ, రవాణా సౌకర్యాల లేమి వెలుగు చూస్తున్నాయి.
విజయవాడలో ఉన్న కార్యకలాపాలను పూర్తిగా అమరావతికి తరలించిన ప్రభుత్వం, ఉద్యోగుల రాకపోకల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు నగరం నుంచి తుళ్లూరు మీదుగా వచ్చే ఉద్యోగుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. సీఆర్డీఏతో పాటు మున్సిపల్ శాఖ, టీఐడీసీఓ (TIDCO), స్వచ్ఛ ఆంధ్ర, టౌన్ ప్లానింగ్ వంటి కీలకమైన 11 విభాగాలు ఇక్కడ ఉద్యోగుల సంఖ్య వేలల్లో ఉన్నాయి. అయితే, ఈ స్థాయిలో సిబ్బంది పెరిగిన ఆర్టీసీ నుంచి ఆశించిన స్థాయిలో బస్సు సర్వీసులు అందుబాటులోకి రాలేదు.

CRDA కు పోవాలంటే వ్యక్తిగత వాహనాలే గతి!
గుంటూరు-తుళ్లూరు మార్గంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నామమాత్రంగానే ఉండటంతో ఉద్యోగులు విధిలేని పరిస్థితుల్లో సొంత వాహనాలపై ఆధారపడుతున్నారు. ఉదయం కార్యాలయానికి చేరుకోవాలన్నా, సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లాలన్నా బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఇది కేవలం సమయానికే కాదు, అదనపు ఆర్థిక భారానికి కూడా దారితీస్తోంది. మహిళా ఉద్యోగులు, వృద్ధ సిబ్బందికి ఈ ప్రయాణం మరీ భారీగా మారింది. రాజధాని అభివృద్ధికి అహర్నిశలు శ్రమించే సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది.
ప్రజలకూ తప్పని తిప్పలు
కేవలం ఉద్యోగులకే కాకుండా, వివిధ ప్రభుత్వ పనుల నిమిత్తం మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య ప్రజలకు సైతం ఈ రవాణా కష్టాలు తప్పడం లేదు. 11 శాఖలు ఒకే చోట ఉండటం వల్ల పని త్వరగా పూర్తవుతుందని వస్తున్న ప్రజలు, సరైన బస్సులు లేక స్థానాలకు చేరుకోవడానికి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.
ఉద్యోగ సంఘాల డిమాండ్..
గుంటూరు నుంచి సీఆర్డీఏ వయా తుళ్లూరు మీదుగా ఆల్ ఎంప్లాయిస్ బస్సు ఉదయం సాయంత్రం వేళలో ఒకసారి మాత్రమే సర్వీసులు నడుపుతుంది ఉద్యోగులు అంటున్నారు. గుంటూరు నుంచి సీఆర్డీఏ భవనానికి వయా రెయిన్ ట్రీ పార్క్ బస్సు ఉన్నా అది సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలు కూడా అందుబాటులో లేవని.. ప్రభుత్వం తక్షణమే స్పందించి గుంటూరు-తుళ్లూరు-సీఆర్డీఏ కార్యాలయంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక బస్సులను (ప్రత్యేక బస్సులు) ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజధాని వేగంగా అభివృద్ధి చెందాలంటే ముందుగా అక్కడ పనిచేసే యంత్రాంగానికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం అత్యవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

