ఆంధ్ర ప్రదేశ్
ఓయి-లింగారెడ్డి గజ్జల
అంతర్జాతీయంగా ముదురుతున్న యుద్ధ మేఘాలు అనూహ్యంగా కలియుగ వైకుంఠం తిరుపతిని తాకాయి. యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభం సామాన్యుడి వంటగదిని చేరకూడదనే ఉద్దేశంతో గ్యాస్ కంపెనీలు తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు ఆధ్యాత్మిక రాజధానిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రేపాటి నుండి తిరుపతి నగరంవ్యాప్తంగా 19.5 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ప్రకటించాయి.
తిరుపతి ఆర్థిక వ్యవస్థ అంతా శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులపైనే ఆధారపడి ఉంటుంది. నగరంలో చిన్న టీ కొట్టు నుండి భారీ హోటళ్ల వరకు సుమారు 3,000కు పైగా తినుబండారాల కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ నెలకు సగటున 40 కమర్షియల్ సిలిండర్లను వినియోగిస్తుంటాయి. ఇప్పుడు ఒక్కసారిగా సరఫరా ఆగిపోవడంతో వేలాదిగా తరలివచ్చే భక్తులకు కనీసం అల్పాహారం, భోజనం అందించడం కూడా హోటల్ యజమానులకు కత్తిమీద సాముల మారింది. ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల వద్ద స్టాక్ నిండుకోవడంతో హోటల్ నిర్వహణ అస్తవ్యస్తమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కమర్షియల్ గ్యాస్ కట్.. గృహ వినియోగానికే మొగ్గు
యుద్ధం వల్ల ముడి చమురు సరఫరాలో ఏర్పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ముందుగా గృహ వినియోగదారులకు (డొమెస్టిక్ యూజర్లు) గ్యాస్ కొరత రాకుండా చూడాలన్నదే కంపెనీల ప్రాధాన్యత. కమర్షియల్ కోటపై వేటు వేయక తప్పదని ప్రతినిధులు వివరిస్తున్నారు. అయితే ఈ వల్ల భక్తులకు ఆహార పదార్థాల ధరలు పెరగడమే కాకుండా, తీవ్రమైన కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏజెన్సీల వద్ద ఆందోళన
ఈ వార్త తెలియగానే తిరుపతిలోని 15కు పైగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద హోటల్ యజమానులు, క్యాటరింగ్ నిర్వాహకుల రద్దీ పెరిగింది. రేపటి నుండి సరఫరా ఉండదన్న భయంతో తమ వద్ద ఉన్న ఖాళీ సిలిండర్ రీఫిల్ చేయించుకోవడానికి తెల్లవారుజాము నుండే క్యూ కడుతున్నారు. ప్రైవేటు గ్యాస్ కంపెనీలు కూడా ఇదే బాట పట్టడంతో ప్రత్యామ్నాయ లేక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

