భారతదేశం
-కిషోర్ కుమార్
పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖా మంత్రి అరూప్ బిస్వాస్ మంగళవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ప్రముఖ ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కార్యక్రమ నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న విమర్శల మధ్య ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన రాజీనామాను ఆమోదించారు.
గత శనివారం మెస్సీ కార్యక్రమం అనంతరం సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫ్యాన్స్ ను అదుపు చేయడంలో లోపాలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం, సరైన ఏర్పాట్ల లేకపోవడం వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. దీని కారణంగా బిస్వాస్ పై ప్రేక్షకులు, ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి.

కోల్కాతా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి విచారణ కమిటీ ఏర్పాటు చేసినందున, ఆ నిష్పాక్షికంగా జరగడం కోసమే తాను క్రీడా శాఖా మంత్రి పదవి నుండి తప్పుకుంటున్నట్లు బిస్వాస్ ప్రకటించారు. “ఈ విషయంలో నా అభ్యర్థనను మీరు ఆమోదిస్తారని ఆశిస్తున్నాను” అని ఆయన లేఖలో స్పష్టం చేశారు. కాగా, రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రిగా ఆయన కొనసాగుతారు, అంటే మంత్రివర్గంలో సభ్యుడిగా ఉంటారు.
కార్యక్రమం జరిగిన రోజు బిస్వాస్, మెస్సీతో పాటు స్టేడియంలోనే ఉన్నారు. బిస్వాస్, ఆయన కుటుంబ సభ్యులు ఫుట్బాల్ స్టార్ను చుట్టుముట్టారని, అధిక ధరలకు టిక్కెట్లు కొనుగోలు చేసిన సాధారణ ప్రేక్షకులకు మెస్సీని సరిగా చూసే అవకాశం దక్కలేదు.

