తెలంగాణ
ఓయ్-జక్కీ మహేష్
తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల మాదిరిగానే.. మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డులకు ఫలితాలు వెలువడ్డాయి.. కాంగ్రెస్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మ్యాజిక్ ఫిగర్ను దాటి ఏకంగా 1,347 వార్డుల్లో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా హస్తం పార్టీ 64 మున్సిపాలిటీలను నేరుగా కైవసం చేసుకుని పట్టణ ఓటర్లపై తన పట్టును నిరూపించుకుంది. ఈ విజయంతో గాంధీ భవన్లో సంబరాలు అంబరాన్నంటాయి.
చతికిలబడ్డ బీఆర్ఎస్, బీజేపీ
ఒకప్పుడు మున్సిపాలిటీల్లో తిరుగులేని శక్తిగా ఉన్న బీఆర్ఎస్ ఈసారి వెనుకబడింది. ఆ పార్టీ కేవలం 717 వార్డులకే పరిమితమై 13 మున్సిపాలిటీలను మాత్రమే దక్కించుకోగలిగింది. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉంటామని భావించిన బీజేపీ కేవలం 61 వార్డుల్లోనే విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్థులు 256 వార్డుల్లో గెలిచి కీలక పాత్ర పోషించారు. ఇక 38 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాక హంగ్ ఏర్పడింది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు ఎటు మొగ్గు చూపితే అటు అధికార పీఠం దక్కే అవకాశం ఉంది.

కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ జోరు
ముపాలిటీలతో పాటు ఏడు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తన సత్తా చాటింది. రామగుండం, మంచిర్యాల, నల్గొండ, కొత్తగూడెం కార్పొరేషన్లను హస్తం పార్టీ సొంతం చేసుకుంది. మంచిర్యాలలో 60 వార్డులకు గానూ 41 చోట్ల కాంగ్రెస్ గెలవడం విశేషం. అయితే కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం బీజేపీ తన పట్టును నిలబెట్టుకుని సత్తా చాటింది. నిజామాబాద్ కార్పొరేషన్లో ఓటర్ల మిశ్రమ తీర్పు ఇవ్వడంతో అక్కడ హంగ్ ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఆ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నట్లు ప్రచారం.
వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ సంచలనం:
ఈ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మహబూబ్నగర్ ఏర్పాటు వడ్డేపల్లి మున్సిపాలిటీని ‘ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్’ పార్టీ కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి మద్దతుదారులు స్వతంత్రులుగా నిలిచి అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. కొడంగల్ నియోజకవర్గంలోనూ మూడు మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం సీఎం రేవంత్ రెడ్డి పట్టుకు నిదర్శనంగా నిలిచారు.
పాలనపై ప్రజల నమ్మకం:
ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో రాజకీయ సమీకరణలను పూర్తిగా మార్చేశాయి. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస విజయాలు సాధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ విజయంగా మారింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ గాలి బలంగా వీచింది. ఫిబ్రవరి 16న మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు క్యాంపు రాజకీయాలు మొదలయ్యే అవకాశం ఉంది.

