అంతర్జాతీయ
ఓయ్-జక్కీ మహేష్
సాధారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఓ ఇంటి ధర దాని లొకేషన్, పరిసరాలు, అక్కడ ఉండే సౌకర్యాలపై ఆధారపడి ఉంటుంది. కానీ న్యూయార్క్ లాంగ్ ఐలాండ్లోని ‘112 ఓషన్ అవెన్యూ’ బంగాళా స్టోరీ వేరు. ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ ‘దెయ్యాల కొంప’గా దీనికి పేరుంది. ఇక్కడ జరిగిన ఘోరకలి కారణంగా జనం ఆ ఇంటి పేరు వింటేనే వణికిపోతారు. అయితే ఆశ్చర్యకరంగా ఇప్పుడు అదే భయంకరమైన చరిత్ర ఈ ఇంటికి అతిపెద్ద మార్కెట్ వాల్యూగా మారిపోయింది. ఇన్వెస్టర్లు, మిస్టరీ ప్రేమికులు ఈ ఇంటిని సొంతం చేసుకుని పోటీ పడుతున్నారు.
ఆ రాత్రి జరిగిన నెత్తుటి చరిత్ర
ఈ బంగాళా ఇంత శాపగ్రస్తంగా మారడానికి 1974, నవంబర్ 13న జరిగిన ఓ భయంకరమైన ఘటనే కారణం. ఆ ఇంట్లో నివసించే డెఫియో కుటుంబానికి చెందిన పెద్ద కొడుకు రోనాల్డ్ డెఫియో జూనియర్, అర్ధరాత్రి పూట తన నిద్రిస్తున్న తల్లిదండ్రులతో పాటు నలుగురు తోబుట్టువులను రైఫిల్తో కాల్చి చంపాడు. మొత్తం ఆరుగురిని అతి కిరాతకంగా అంతమొందించిన తర్వాత రోనాల్డ్ చెప్పిన మాటలు అందరినీ నివ్వెరపరిచాయి. ఆ ఇంటి గోడల నుంచి వినిపించిన అదృశ్య శబ్దాలే తనను హత్య చేయమని ప్రేరేపించాయని అతను కోర్టులో వాదించాడు. ఈ నెత్తుటి చరిత్రే ఆ ఇంటిని ఒక హర్రర్ స్పాట్గా మార్చేసింది.

చెడ్డ పేరే అతిపెద్ద బలం
సాధారణంగా ఏదైనా ఇంట్లో హత్యలు జరిగితే దాని విలువ పడిపోతుంది, ఎవరూ అక్కడ ఉండటానికి ఇష్టపడరు. కానీ ఎమిటీవిల్ బంగాళా విషయంలో మాత్రం అంతా రివర్స్లో జరిగింది. ఇక్కడ జరిగిన హత్యలు, ఆ తర్వాత అక్కడ నివసించిన వారు అనుభవించిన పారానార్మల్ అనుభవాల ఆధారంగా హాలీవుడ్లో అనేక సినిమాలు, పుస్తకాలు వచ్చాయి. దీనివల్ల ఈ ఇంటికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పబ్లిసిటీ లభించింది. ఈ పబ్లిసిటీనే పెట్టుబడిదారులకు వరంగా మారింది. ఒక మిస్టరీ హౌస్లో ఉండాలని భావించే ధనవంతులకు ఇది ఒక ‘హాట్ ప్రాపర్టీ’గా మారిపోయింది.
గుర్తు పట్టకుండా చేసిన ‘ప్లాస్టిక్ సర్జరీ’
ఈ ఇంటికున్న విపరీతమైన క్రేజ్ వల్ల యజమానులకు ప్రైవసీ సమస్యలు ఎదురయ్యాయి. ప్రతిరోజూ పర్యాటకులు వచ్చి ఫోటోలు తీయడం, కిటికీల్లోంచి చూడటం వంటి పనులతో విసిగిపోయిన యజమానులు ఆ ఇంటికి ‘ప్లాస్టిక్ సర్జరీ’ చేశారు. దెయ్యం కళ్లలాగా కనిపించే ఆ ప్రసిద్ధ కిటికీలను తొలగించి, రంగులు మార్చి.. ఆధునిక రూపునిచ్చారు. చివరికి ఆ ఇంటి పాత గుర్తులేవీ మిగలకుండా అడ్రస్ను కూడా 112 నుంచి 108 ఓషన్ అవెన్యూగా మార్చేశారు. అంటే ఒక హర్రర్ బ్రాండ్ను రీ-బ్రాండింగ్ చేసి సాదాసీదా లగ్జరీ విల్లాగా మార్కెట్లోకి తెచ్చారు.
నేటికీ మిస్టరీనే..
ఇన్ని మార్పులు చేసినా, ఎంతగా ఆధునీకరించినా ఈ ఇంటికి మిస్టరీ మాత్రం అలాగే ఉండిపోయింది. ఇది కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు.. ప్రపంచం గర్వించే అతిపెద్ద మిస్టరీల్లో ఒకటిగా నిలిచిపోయింది. విలాసవంతమైన రాజసం, భయం గొలిపే గతం కలగలిసిన ఈ బంగళా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక సంచలనం. ఎంతటి ధర పలికినా కొనేందుకు సిద్ధంగా ఉన్న కొనుగోలుదారులు ఉండటమే ఈ ఇంటి ప్రత్యేకత.

