ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
ఏపీ ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లుగా ప్రతిపాదించారు. ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. 19 నెలల కాలంలో కూటమి పురోగతిని వివరిస్తూ బడ్జెట్ ప్రాధాన్యతలను కలిగి ఉంది. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్దం చేశాయి. కాగా, ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకు కేటాయింపులు చేసిన ప్రభుత్వం . పెండింగ్ హామీలను ఎక్కడా ప్రస్తావించలేదు. ఇప్పుడు ఇదే వ్యవహారం రాజకీయంగా చర్చగా మారుతోంది.
కూటమి నేతలు 2024 ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ తో పాటుగా మరిన్ని కీలక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ లోని నాలుగు ప్రధాన హామీలను అమలు చేస్తున్నారు. ఈ బడ్జెట్లో ఆ పథకాలకు నిధులు కేటాయించారు. మరో రెండు పథకాలతో పాటు కీలక హామీ పైన ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. అయితే, వాటి ప్రస్తావన ఎక్కడా చేయలేదు. ఉద్యోగులకు పీఆర్సీతో పాటుగా ఐఆర్ పైనా ఏదైనా చెబుతారని ఆశించినా.. ఆ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ పథకం ప్రకారం ప్రతి లబ్ధిదారుడికి నెలకు రూ. 3,000 చొప్పున భృతి ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు మూడో బడ్జెట్ లోనూ ఈ హామీ అమలుపై స్పష్టత ఇవ్వలేదు. అదే విధంగా 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు బడ్జెట్ లోనూ ఈ హామీ అమలు గురించి ప్రస్తావన చేయలేదు.

ఈ మూడు హామీలు అమలు పై చర్చ
కాగా, సూపర్ సిక్స్ లో మరో ప్రధాన హామీగా ఉన్న ఆడబిడ్డ నిధిపై ప్రకటన చేయకపోవటంపైనా చర్చ జరుగుతోంది. 18 ఏళ్లు దాటిన మహిళలకు ప్రతీ నెలా రూ 1500 ఆడబిడ్డ నిధి అమలు సమయంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అదే విధంగా ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన ఆశించినా.. అలాంటి నిర్ణయం రాలేదు. అయితే.. ప్రస్తుతం అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలకు భారీగా నిధులు పెంచారు. పెన్షన్ల పెంపు కోసం బడ్జెట్ లో ఎన్టీఆర్ భరోసా కోసం రూ.27,719 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ లో స్త్రీశక్తి పథకం కోసం రూ.1,420 కోట్లు ప్రతిపాదించారు. ఆటో డ్రైవర్ల సేవలో – రూ.450 కోట్లు, తల్లికి వందనం – రూ.9,668 కోట్లు, స్త్రీ, శిశు సంక్షేమం – రూ.4,581 కోట్లు కేటాయింపులు చేసారు. అన్నదాత సుఖీభవ – రూ.6,600 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి – రూ.500 కోట్లు, మత్స్యకార సేవలో – రూ.260కోట్లు, పంటల బీమా – రూ.250 కోట్లు, పీఎం కృషి సించాయి యోజన రూ.190 కోట్లు కేటాయింపులు చేసారు. పెండింగ్ హామీల పైన ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవటం పైనా ఇప్పుడు రాజకీయంగా చర్చ మొదలైంది.

