భారతదేశం
ఓయ్-సయ్యద్ అహ్మద్
ఇరాన్ వార్ ప్రభావం భారత్ పై తీవ్రంగా మారింది. ఇప్పటికే యుద్ధం మొదలై 16 రోజులు దాటిపోవడం, దేశీయంగా ఎల్పీజీ (LPG) సరఫరాగా తగ్గడం, ఇదే అదనుగా ఎక్కడికక్కడ గ్యాస్ సిలెండర్లు బ్లాక్ చేస్తున్న పరిస్ధితితో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు కమర్షియల్ సిలెండర్ల సరఫరా తగ్గిపోవడంతో హోటల్లు మూతపడే పరిస్థితి వచ్చేసింది. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కీలక సూచన చేసింది.
ఎల్పీజీ సరఫరాలపై ఒత్తిడిని తగ్గించడానికి, వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ఇతర పైపుల ద్వారా సహజ వాయువుకు (PNG) మారాలని ప్రభుత్వం కోరింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జైంట్ సెక్రటరీ సుజాత శర్మ ఇవాళ మాట్లాడుతూ.. అనేక కంపెనీలు పీఎన్జీ కనెక్షన్లను స్వీకరించేలా ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాయని చెప్పారు.

మార్చి 31కి ముందు పీఎన్జీ కనెక్షన్ తీసుకొని గ్యాస్ కొనుగోలు ప్రారంభించే గృహ వినియోగానికి ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ రూ.500 విలువైన ఉచిత గ్యాస్ను అందించినట్లు ఆమె చెప్పారు. క్లీనర్ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలలో భాగంగా గెయిల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కూడా పీఎన్జీ మార్పును ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలను అందించాయని శర్మ తెలిపారు.

మరోవైపు ఇరాన్ పక్కన ఉన్న హార్ముజ్ జలసంధి నుంచి బయటపడిన భారత నౌక శివాలిక్ ఖతార్ నుంచి ఇవాళ ముంద్రా పోర్టుకు చేరుకుంది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలోని ఎల్పీజీ ట్యాంకర్ నౌక శివాలిక్లో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ను తీసుకువచ్చింది. ఖతార్ లోని రాస్ లఫాన్ నుండి బయలుదేరిన మరో నౌక నందా దేవి ఇప్పటికే గుజరాత్ తీరానికి దగ్గరలో ఉంది. ఇది రేపు ఉదయం ఆరున్నర గంటలకు గుజరాత్లోని కాండ్ల ఓడరేవుకు చేరుకుంటుందని అంచనా. ఈ రెండు నౌకలు కలిపి తీసుకున్న ఎల్పీజీ గ్యాస్ 92,700 మెట్రిక్ టన్నులు.

