తెలంగాణ
ఓయి-లింగారెడ్డి గజ్జల
శివరాత్రి పర్వదినం సందర్భంగా సెలవులపై తెలంగాణ ఉద్యోగుల్లో కొంత నిరాశ. ఈసారి పండుగ ఆదివారం రావడంతో సాధారణ పబ్లిక్ హాలిడే అదే రోజుకు పరిమితమైంది. అయితే మరుసటి రోజు, అంటే 16వ తేదీ సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆప్షనల్ హాలిడే ప్రకటించలేదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
ఇక పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. శివరాత్రి రోజున జాగరణ చేసే ఉద్యోగులు మరుసటి రోజు విధులకు హాజరుకావడం ఇబ్బందిగా మారుతుందని భావించిన ఏపీ ప్రభుత్వం సోమవారం (16వ తేదీ)ని ఐచ్ఛిక సెలవుగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడంతో అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవసరాన్ని బట్టి సెలవు తీసుకునే అవకాశం కల్పించడం వల్ల వారికి కొంత ఊరట లభించింది.

తెలంగాణలో అయితే సోమవారం సాధారణ పనిదినంగానే ఉంటుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, శాఖలు రెగ్యులర్గా పనిచేస్తున్నాయి. స్కూళ్లు కూడా యథావిధిగా కొనసాగుతాయి. ఆప్షనల్ హాలిడే ప్రకటన లేకపోవడంతో ఉద్యోగులు తమ విధులకు హాజరుకావాల్సి ఉంటుంది.
బ్యాంకులు పనిచేస్తాయి..
బ్యాంకుల విషయానికి వస్తే, ఫిబ్రవరి 14న రెండో శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 15న ఆదివారం కారణంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే 16వ తేదీ సోమవారం బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. కొన్ని చోట్ల ఆప్షనల్ హాలిడే అంశంపై చర్చ జరిగినప్పటికీ, సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
మొత్తానికి, శివరాత్రి సందర్భంగా తెలంగాణలో ఆప్షనల్ సెలవు లేకపోవడం ఒక వైపు ఉద్యోగుల్లో నిరాశ కలిగిస్తుండగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చింది.

