తెలంగాణ
ఓయ్-కొరివి జయకుమార్
హైదరాబాద్లో ఐసిసి రాయదుర్గంలో యువ యూట్యూబర్ కోమలి మృతి చెందడం కలకలం రేపింది. మణికొండ చిత్రపురి కాలనీలో బంధువుల ఇంట్లో ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కాగా 21 ఏళ్ల కోమలి మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుకుంటూ పార్ట్టైమ్గా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. లైఫ్ స్టైల్, డైలీ వ్లాగ్స్, వ్యక్తిగత అనుభవాలకు సంబంధించిన వీడియోలతో ఆమెకు యువతలో ఫాలోయింగ్ పెరిగింది.

ప్రేమ పరిచయం… తరువాత విభేదాలు
అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డితో కోమలికి పరిచయం ఏర్పడిందని అది ప్రేమగా మారినట్లు తెలిసింది. సుమారు మూడు సంవత్సరాలు కొనసాగిన ఈ సంబంధం ఏడాది క్రితం మనస్పర్థల కారణంగా ముగిసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బ్రేకప్ తరువాత కోమలి తీవ్ర భావోద్వేగ ఒత్తిడికి లోనైనట్లు సమాచారం.
గతంలోనూ ఆందోళనకర పరిస్థితులు..
బ్రేకప్ తర్వాత కోమలి మానసికంగా కుంగిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకుని కాపాడినట్లు సమాచారం. ఇటీవల మళ్లీ మధ్య సంభాషణలో వాగ్వాదం జరిగినట్లు.
తిరుమల పాదయాత్ర వీడియో వైరల్..
తన వ్యక్తిగత కోరిక నెరవేరాలని కోరుకుంటూ కోమలి తిరుమలకు కాలినడకన వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ చేసిన ఆ పాదయాత్ర వీడియో ఆమె చివరి పోస్టుగా నిలిచింది.
ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులను ప్రశ్నిస్తూ ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా ఒత్తిడి, వ్యక్తిగత భావోద్వేగాలు వంటి కోణాల్లో కూడా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
