ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
తిరుమలలో భక్తుల ప్రదర్శన. శనివారం నాడు 82,043 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 32,299 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.74 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 నుంచి 18 గంటల సమయం పట్టింది.
శ్రీవారి లడ్డూ ప్రసాద వివాదం కొనసాగుతున్న ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రూ. 25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న అధునాతన ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో ఈ-టంగ్, ఈ-నోస్ అమర్చనుంది. వీటి విలువ 3.5 కోట్ల రూపాయలు. ఫ్రాన్స్లో తయారైన ఈ అత్యాధునిక పరికరాలు ఇవి. ఈ- టంగ్ రుచి, ఈ- నోస్ వాసనను గ్రహించగలుగుతాయి. ఆహార పదార్థాల నాణ్యతను శాస్త్రీయంగా విశ్లేషిస్తుంది.

ఈ యంత్రాలు నెయ్యి, ఇతర ఆహార వస్తువులలోని సూక్ష్మ కల్తీ లేదా నాణ్యత లోపాలను గుర్తించగలవు. ఈ ల్యాబొరేటరీ వచ్చే నెల నుండి కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. దీని నిర్మాణం, ఇతర పరికరాల స్టాలెషన్ పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. వీటితో పాటు ఈ-టంగ్, ఈ-నోస్ మెషీన్లను కూడా అమర్చుతారు. శ్రీవారి ప్రసాదం తయారీకి ఉపయోగించే సుమారు 60 రకాల ముడి పదార్థాలైన నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, బాదం, శనగపప్పు, పంచదార, యాలకులు, పసుపు, మిరపపొడి స్థానిక ఇక్కడ పరీక్షిస్తారు.
భక్తులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ ల్యాబొరేటరీ ఏర్పాటుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) రూ. 23 కోట్లు ఇచ్చింది. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తిరుమలలోని ఫ్లోర్ మిల్ ఆవరణలోని పాత రెండు అంతస్తుల భవనాన్ని కేటాయించారు. దీని పునరుద్ధరణ పనులు గత ఏడాది జూలైలో మొదలయ్యాయి. 90 శాతం పూర్తయింది.
ఈ ల్యాబొరేటరీ.. మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, సెన్సరీ అనాలిసిస్ విభాగాల ద్వారా పనిచేస్తుంది. ప్రసాదం, ఆహార పదార్థాలు, తాగు, ముడి పదార్థాలలో 200 రకాల పురుగుమందులు, భారీ లోహాలు, జీవుల కాలుష్యం, యాంటీబయాటిక్స్ వంటి హానికర పదార్థాలను పరీక్షిస్తుంది. వాటిని గుర్తించడానికి అవసరమైన 50 అధునాతన పరికరాలు ఇందులో అమరుస్తారు. టీటీడీ సరఫరా చేసే తాగునీరు కూడా క్రమం తప్పకుండా ఇక్కడ పరీక్షిస్తారు.

