వ్యాపారం
ఓయి-లింగారెడ్డి గజ్జల
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఖాతాదారుల కోసం కొత్త ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. తక్కువ ప్రీమియంతో అధిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ పథకం ఇప్పుడు కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
SBI ఏడాదికి రూ.3,000 – భరోసా రూ.60 లక్షలు
ఈ బీమా పథకంలో చేరేందుకు ఖాతాదారుల సంవత్సరానికి రూ.3,000 ప్రీమియం చెల్లించాలి. అంటే రోజుకు సుమారు రూ.8.2 మాత్రమే. ఒకసారి అంగీకారపత్రం (కన్సెంట్), ఖాతా నుంచి ప్రీమియం కట్ కోసం అనుమతి ఇస్తే, ప్రతి సంవత్సరం ఆటోమెటిక్గా పునరుద్ధరణ (ఆటో రిన్యువల్) సౌకర్యంగా ఉంటుంది. దీంతో ప్రతి ఏడాది మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు.

ఎలాంటి బీమా వర్తిస్తుంది?
బీమా పొందిన వ్యక్తి రోడ్డు ప్రమాదం, ప్రకృతి విపత్తులు (వరదలు, భూకంపాలు మొదలైనవి), పాముకాటు వంటి అనుకోని ప్రమాదాల వల్ల మరణిస్తే, నామినీకి రూ.60 లక్షల వరకు పరిహారం అందుతుంది. మరణ ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత బ్యాంక్ బ్రాంచ్లో సమర్పించాలి. అన్ని విధానాలు పూర్తయ్యాక పరిహారం నామినీ ఖాతాలో జమ అవుతుంది.
అదనపు లాభాలు..
కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కొన్ని అదనపు సౌకర్యాలు కూడా ఉన్నాయి:
- కుటుంబ యజమాని మరణిస్తే ఇద్దరు పిల్లల చదువులకు రూ.20,000 వరకు సహాయం
- అంత్యక్రియల ఖర్చులకు రూ.10,000
- అంబులెన్స్ ఖర్చులకు రూ.1,500
- ఇవి ప్రధాన బీమా మొత్తానికి అదనంగా చెల్లించబడతాయి.
ఎలాంటి సందర్భాల్లో బీమా వర్తించదు?
ఆత్మహత్య, మాదకద్రవ్యాల వినియోగం వల్ల మరణం, లేదా ఇతర సహజ కారణంగా సంభవించిన మరణాలకు ఈ ప్రమాద బీమా వర్తించదు. కాబట్టి పాలసీ నిబంధనలను ముందుగా పూర్తిగా తెలుసుకోవడం అవసరం.
తక్కువ ప్రీమియంతో పెద్ద మొత్తంలో ప్రమాద బీమా భద్రత పొందాలని భావించే ఖాతాదారులకు ఈ పథకం కోసం మారే అవకాశం ఉంది. అయితే, పాలసీలోని షరతులు, అర్హతలు, క్లెయిమ్ వంటి విధానాలను స్పష్టంగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.

