భారతదేశం
-బొమ్మ శివకుమార్
విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (AAIB).. ఫిబ్రవరి 12న కీలక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంపై దర్యాప్తు పూర్తయిందంటూ వచ్చిన మీడియా నివేదికలను AAIB ఖండించింది. ఆ వాదనలు “తప్పు, ఊహాజనితం” అని స్పష్టం చేసింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సంస్థ, జూన్ 2025 నాటి దుర్ఘటన విచారణ ఇంకా కొనసాగుతోందని చెప్పింది. ఇప్పటివరకు ఎటువంటి తుది నివేదికలు విడుదల కాలేదని తెలియజేసింది.
ఇటాలియన్ దినపత్రిక కొరియెరా డెల్లా సెరా నివేదిక నేపథ్యంలో AAIB ఈ వివరణ ఇచ్చింది. విమానం ఇంధన స్విచ్లలో సాంకేతిక లోపం లేదని పరిశోధకులు గుర్తించారు. అయితే, పాశ్చాత్య విమానయాన సంస్థలను ఉటంకిస్తూ, ప్రమాదానికి ఒక పైలట్ ఉద్దేశపూర్వకంగా రెండు ఇంధన నియంత్రణలను నిలిపివేయడం కారణమని ఆ పత్రిక సూచించింది. ఈ ఆరోపణలను AAIB తోసిపుచ్చింది. దర్యాప్తు తుది దశకు చేరలేదని, అకాల నిర్ధారణలకు రాకూడదని స్పష్టం చేసింది.
బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఆపరేట్ చేసిన ఎయిర్ ఇండియా విమానం 171, 2025 జూన్ 12న టేకాఫ్ కాగానే అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. విమానం రెండు ఇంజిన్లలో శక్తి కోల్పోయింది, 32 సెకన్లలోనే వైద్య విద్యార్థుల హాస్టల్ను ఢీకొట్టింది. విమానంలో 242 మంది ఉండగా, 241 మంది ప్రాణాలు కోల్పోయారు. నేలపై ఉన్న మరికొందరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 260కి చేరింది.
ఈ దుర్ఘటన తర్వాత, ఎయిర్ ఇండియా శిథిలాల నుండి సేకరించిన వ్యక్తిగత వస్తువులను బాధితుల కుటుంబాలకు తిరిగి ఇస్తోంది. కార్యకలాపాలలో బట్టలు, ఆభరణాలు, ప్రయాణ పత్రాలు శోధన, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ఇతర విలువైన వస్తువులతో సహా వేలాది వస్తువులు లభ్యమైనట్లు సంస్థ ధృవీకరించింది.

సంస్థ ప్రకారం, సేకరించిన ప్రతి వస్తువును జాబితా చేసి భద్రపరిచారు. యజమానులను గుర్తించి, వారికి చేరవేసే ప్రక్రియ స్థానిక అధికారులు, విదేశాల్లోని బంధువుల కోసం కాన్సులర్ ప్రతినిధులతో సమన్వయంతో సాగుతోంది. కుటుంబాలను వ్యక్తిగతంగా సంప్రదించి, వస్తువుల అప్పగింత వివరాలు అందించారు. ఇది కొంత సంతృప్తిని అందించినా, కుటుంబాల్లో, పరిశీలనలను కూడా పెంచింది.

