అంతర్జాతీయ
ఓయ్-సయ్యద్ అహ్మద్
ఇరాన్ (iran)పై ఇజ్రాయెల్ తో కలిసి యుద్ధం ప్రారంభించి నాలుగు వారాలు అవుతున్న వేళ అకస్మాత్తుగా డొనాల్డ్ ట్రంప్ (ట్రంప్) వెనక్కి తగ్గారు. రెండు రోజుల క్రితం ఇరాన్ కు 48 గంటల గడువు ఇచ్చి హార్ముజ్ జలసంధిని తెరవకపోతే మీ విద్యుత్ ప్లాంట్లపై భీకరదాదులు తప్పవని హెచ్చరికలు చేసిన ట్రంప్ … ఆ తర్వాత ఇరాన్ తామూ అదే పని చేస్తామంటూ చేసిన హెచ్చరికలతో వెనక్కి తగ్గారు. ఐదు రోజుల పాటు ఈ దాడులను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచం నివ్వెరపోయింది.
ఇప్పటికే ఇరాన్ యుద్దంలో వరుస ఎదురుదెబ్బలు తింటూ, ఇందులో నుంచి బయటపడే వ్యూహం వెతుక్కుంటున్న అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ .. ఇప్పుడు అదే ఇరాన్ తో చర్చలు ప్రారంభిస్తానంటూ చెప్పేసి తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. దీన్ని బట్టి చూస్తే ఇక ఇరాన్ వార్ నుంచి బయటపడేందుకు ట్రంప్ మరిన్ని దారులు వెతుకుతున్నట్లే. ఇందులో భాగంగా అసలు ఈ వార్ ను తాను మొదలుపెట్టలేదని చెప్పుకోనేందుకు తాజాగా ట్రంప్ ప్రయత్నించారు. అందుకు రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ ను బలి చేశారు.

ఫాక్స్ న్యూస్ లో తన రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ తో కలిసి చర్చలో పాల్గొన్న ట్రంప్.. ఇరాన్ వార్మని మొదలుపెట్టి చెప్పింది నువ్వేగా అంటూ ఆయన్ను బహిరంగంగా బుక్ చేసారు. దీనితో పీట్ హెగ్సేత్ కు ఎలా స్పందించాలో తెలియలేదు. సైనిక చర్య కోసం మొదటగా ఒత్తిడి తెచ్చింది తన రక్షణ మంత్రి పీట్ హెగ్సెట్ అని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. తన పక్కనే ఉన్న హెగ్సెట్తో ట్రంప్ మాట్లాడుతూ, “పీట్, మొదట మాట్లాడింది మీరేనని నేను అనుకుంటున్నాను. ‘వారిని అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు కాబట్టి, మనం దీన్ని చేద్దాం’ అని మీరే అన్నారు” అని అన్నారు.

తాను పీట్కు ఫోన్ చేశానని, అలాగే జనరల్ కేన్కు ఫోన్ చేశానని, మన గొప్ప వ్యక్తుల్లో చాలా మందికి ఫోన్ చేశానని ట్రంప్ చెప్పారు. మధ్యప్రాచ్యంలో ఒక సమస్య ఉంది, లేదా మనం మధ్యప్రాచ్యంలో ఒక చిన్న ప్రయాణం చేసి, అక్కడ ఆగి ఒక పెద్ద సమస్యను పరిష్కరించినట్లు చెప్పినట్లు ట్రంప్ గుర్తుచేసుకున్నారు. అయితే వారు ఆ (గల్ఫ్) దేశాలన్నిటిపైనా ఊహించని విధంగా దాడి చేసిన తీరు చూడండి, దాని గురించి ఎవరూ ఆలోచించలేదంటూ తనకు ఇరాన్ ఎలా షాకిచ్చిందో చెప్పుకొచ్చారు.

