తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
గ్యాస్ కొరత ఉపాధి దెబ్బ తీస్తోంది. గ్యాస్ సిలిండర్ల కొరత పెరిగింది. దీని కారణంగా చిన్న హోటళ్లు, ధాబాలు, క్లౌడ్ కిచెన్లు తమ కార్యకలాపాలు తగ్గించుకోవాల్సి రావడంతో ఫుడ్ డెలివరీ ఆర్డర్లు పడిపోయాయి. ఒకటేమిటీ … చిన్న బండ్ల వ్యాపారాల నుండి పెద్ద రెస్టారెంట్ల వరకు పొట్టపోషించే కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థల్లో పనిచేసే డెలివరీ ఏజెంట్ల దినసరి ఉపాధికి తీవ్ర ముప్పు వాటిల్లింది.
గ్యాస్ కొరతతో దాబాలు, క్యాటరింగ్ సేవలు, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఫుడ్ ఆర్డర్లు ఏకంగా 50-60 శాతం మేర పడిపోయాయి. రోజుకు 30 ఆర్డర్లు డెలివరీ చేస్తూ ఉపాధి పొందే ఏజెంట్లకు, ఇప్పుడు కనీసం 5 నుంచి 10 ఆర్డర్లు కూడా రావడం గగనంగా మారింది. అన్ని రంగాల జీవనోపాధులు గ్యాస్ సిలిండర్ల దెబ్బకు కుదేలవుతున్నాయి. హోటళ్లలో వంటలు తగ్గడంతో జొమాటో, స్విగ్గీ వంటి ప్లాట్ఫారమ్లలో ఆర్డర్లు తగ్గిపోయాయి. గతంలో రోజుకు 30 నుంచి 40 ఆర్డర్లు చేసేవారికి ఇప్పుడు 20 కూడా రావడం లేదని డెలివరీ సిబ్బంది చెబుతున్నారు. గంటల తరబడి యాప్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. ఆర్డర్లు రాకపోతే డెలివరీ తగ్గుతుంది. దాని ప్రభావం వారి జీతాలపై పడుతుంది.

ఈ సంక్షోభం డెలివరీ కార్మికులతో పాటు క్లౌడ్ కిచెన్లలో పనిచేసే ఉద్యోగులు, వీధి వ్యాపారుల జీవనధారను కూడా ప్రభావితం చేస్తుంది. కొందరు ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు వంటి ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తున్నప్పటికీ పెరిగిన విద్యుత్ బిల్లులు భారీగా మారుతున్నాయి. కట్టెల పొయ్యిలు పెడదామన్నా.. ఇప్పుడు కట్టెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.. కరెంటు పొయ్యిలు వాడదామంటే పెరిగే కరెంటు బిల్లు తలుచుకుంటే గుండె గుభేలుమంటోందంటూ ఉద్యోగులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులను ఆదుకునేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ యూనియన్ ప్రతినిధులు కేంద్ర కార్మిక శాఖకు లేఖ రాశారు. స్విగ్గీ, జొమాటో లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ఉపాధి కోల్పోయిన డెలివరీ ఏజెంట్లకు తక్షణ పరిహారంగా రూ. 10,000 చెల్లించాలి. ఏజెంట్ల వర్క్ ఐడీలపై 3 నెలల పాటు మారటోరియం విధించాలి. ‘సామాజిక భద్రతా కోడ్-2020’ కింద గిగ్ వర్కర్లందరికీ పూర్తిస్థాయి కవరేజీ కల్పించాలని అభ్యర్ధించారు.

